కామారెడ్డి జిల్లాలో కెనాల్ గుంతలో కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు

కామారెడ్డి జిల్లాలో కెనాల్ గుంతలో కారు బోల్తా.. ఇద్దరు మృతి, ముగ్గురికి గాయాలు
  • బాధిత కుటుంబసభ్యుల ఆందోళన
  • కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మలయ్యపల్లిలో ఘటన

ఎల్లారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి సమీపంలో పోచారం కెనాల్​పై నిర్మిస్తున్న బ్రిడ్జి వద్ద గుంతలో కారు బోల్తా పడి ఇద్దరు చనిపోగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్  జిల్లా పాపన్నపేట మండలం నర్సింగ్​రావుపల్లి తండాకు చెందిన లునావత్​ పీర్యా, తన ఇద్దరు కొడుకులు, మరో బంధువుతో కలిసి కారులో నిజామాబాద్​ జిల్లా వర్ని మండలంలోని బడాపహాడ్(పెద్దగుట్ట)కు బుధవారం రాత్రి బయలుదేరారు.

 బడపహాడ్​ వద్ద శుక్రవారం పండుగ ఏర్పాట్లు చేసుకునేందుకు వెళ్లారు. ఎల్లారెడ్డి మండలం మల్లయ్యపల్లి సమీపంలో పోచారం కెనాల్​పై బ్రిడ్జి నిర్మించేందుకు పక్కన గుంత తవ్వారు. కారు కెనాల్  గుంతలో పడిపోవడంతో డ్రైవర్​ కేతావత్  పీర్యా(36) అక్కడికక్కడే చనిపోగా, లూనావత్​ పీర్యా(32) ఎల్లారెడ్డి హాస్పిటల్​లో చనిపోయాడు. ఈ ప్రమాదంలో సోను, ప్రవీణ్, వేణుకు గాయాలు కాగా, వీరిని మెదక్​లోని ప్రైవేట్  హాస్పిటల్​కు 
తరలించారు.

కుటుంబ సభ్యుల రాస్తారోకో..

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ఘటనా స్థలంలో రోడ్డుపై రాస్తారోకో చేశారు. రోడ్డు పనుల్లో భాగంగా బ్రిడ్జి నిర్మాణానికి గుంత తవ్వి సరైన రక్షణ చర్యలు చేపట్టకపోవడంతో పాటు పనులు పూర్తయిన తరువాత గుంత పూడ్చక పోవడంతోనే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. కాంట్రాక్టర్​ నిర్లక్ష్యం వల్లే ఇద్దరు చనిపోయారని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్​ చేశారు. రాస్తారోకోతో రోడ్డుకు ఇరువైపులా భారీగా వెహికల్స్​ నిలిచిపోయాయి. పోలీసులు అక్కడికి చేరుకొని బాధితులకు నచ్చజెప్పి ఆందోళనను విరమింపజేశారు.