న్యూఢిల్లీ: 2-డీజీ డ్రగ్ వినియోగంపై డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) మార్గదర్శకాలు విడుదల చేసింది. కొవిడ్-19 వైద్యంలో అత్యవసర వినియోగం కింద ఈ డ్రగ్కు అనుమతించినట్టు వెల్లడించింది. మధ్యస్థ నుంచి తీవ్రస్థాయి లక్షణాలున్న కేసుల్లో మాత్రమే వినియోగించాలని స్పష్టం చేసింది. పాజిటివ్గా గుర్తించిన వెంటనే గరిష్టంగా 10 రోజులపాటు డ్రగ్ ఇవ్వొచ్చని తెలిపింది. ఆస్పత్రుల్లో వైద్యుల సూచన మేరకు మాత్రమే డ్రగ్ వినియోగించాలని సూచించింది.
‘నియంత్రణ లేని మధుమేహం, తీవ్రమైన హృద్రోగ సమస్యలు, తీవ్ర శ్వాసకోస ఇబ్బందులు, తీవ్ర హెపాటిక్ రీనల్ ఇంపెయిర్మెంట్ సమస్యలున్నవారిపై 2-డీజీ డ్రగ్ను పరీక్షించలేదు. కాబట్టి అలాంటి వారికి వినియోగించే సమయంలో మరిన్ని జాగ్రత్తలు అవసరం. గర్భిణులు, పాలిచ్చే తల్లులు, 18 ఏళ్ల లోపువారికి 2-డీజీ డ్రగ్ ఇవ్వొద్దు. రోగులతోపాటు వారి బంధువులు ఈ డ్రగ్ కోసం ఆస్పత్రి యాజమాన్యాలను, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్ను సంప్రదించొచ్చు. 2dg@drreddys.comకు మెయిల్ చేయడం ద్వారా డ్రగ్ సప్లై కోరొచ్చు’ అని డీఆర్డీవో పేర్కొంది.