చెన్నై: దుబాయ్, కాంబోడియా నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణికులకు కరోనా పాజిటివ్గా తేలింది. బుధవారం తమిళనాడులోని మధురై ఎయిర్పోర్ట్కు వచ్చిన ప్రయాణికులకు టెస్ట్ చేయగా ఇద్దరికి వైరస్ సోకినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో విదేశాల నుంచి రాష్ట్రానికి వచ్చిన వారిలో పాజిటివ్ వచ్చిన వారి సంఖ్య నాలుగుకు పెరిగింది. మంగళవారం చైనా నుంచి వయా కొలోంబో మీదగా వచ్చిన ఓ మహిళా, ఆమె ఆరేండ్ల కూతురికి పాజిటివ్ వచ్చినట్లు ఆ రాష్ట్ర హెల్త్ మినిస్టర్ సుబ్రమణియన్ తెలిపారు. తాజాగా మరో ఇద్దరికి వైరస్ సోకింది.
ప్రస్తుతం వారిద్దరిని క్వారంటైన్లో ఉంచినట్లు తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన వారిలో కరోనా కేసులు పెరుగుతుండటంతో తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఉన్న నాలుగు ఎయిర్పోర్ట్లలో ప్యాసింజర్లందరికీ కరోనా టెస్టులు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ముఖ్యంగా చైనా, జపాన్, హంగ్కాంగ్, తైవాన్, సౌత్కొరియా నుంచి వచ్చే వారిని కచ్చితంగా టెస్టులు చేయాలని సీఎం ఎంకే స్టాలిన్ ఆదేశించినట్లు సబ్రమణియన్ తెలిపారు. మిగతా దేశాల నుంచి వచ్చే ప్యాసింజర్లకు ర్యాండమ్గా వైరస్ టెస్టులు చేయాలని చెప్పారన్నారు.