మోడీ G20 షెడ్యూల్ : 45 గంటల్లో 20 సమావేశాలు

మోడీ G20 షెడ్యూల్ : 45 గంటల్లో 20 సమావేశాలు

జీ20 సదస్సులో భాగంగా ప్రధాని మోడీ రెండు రోజుల పాటు ఇండోనేషియాలో పర్యటించనున్నారు. బాలీలో నవంబర్ 15, 16 తేదీల్లో జీ20 సదస్సు జరగనుంది. 45గంటలపాటు బాలీలో ఉండే మోడీ.. సుమారు 20 భేటీల్లో పాల్గొననున్నారు. ఈ పర్యటన కోసం సోమవారం ప్రధాని బాలీకి వెళ్తారు. జీ20 సదస్సులో భాగంగా 10మంది ప్రపంచాధినేతలతో ఆయన సమావేశమవుతారు. అనంతరం అక్కడి ప్రవాస భారతీయులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొంటారు. 

జీ20 సదస్సులో భాగంగా ఆహారం, ఇందన భద్రత, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ హెల్త్ వంటి కీలక సమావేశాల్లో మోడీ పాల్గొంటారని విదేశాంగ కార్యదర్శి వినయ్ క్వాత్రా తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ, ఇంధన, పర్యావరణం వంటి అంశాలపై మోడీతో పాటు ఇతర నేతలు చర్చిస్తారని తెలిపారు. బ్రిటన్ కొత్త ప్రధాని రిషి సునాక్ తోనూ మోడీ భేటీ అయ్యే అవకాశాలున్నాయి. 

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్స్లర్ ఓలఫ్ షోల్జ్, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ ఈ సదస్సుకు హాజరుకానున్నారు. రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం ఈ సమావేశాలకు హాజరుకావడం లేదని తెలుస్తోంది. జీ20 నిర్వహణ బాధ్యతలను డిసెంబర్ 1 నుంచి ఇండియా నిర్వర్తించనుంది.