మహారాష్ట్రలో 2 వేల బ్లాక్​ ఫంగస్​ కేసులు

మహారాష్ట్రలో 2 వేల బ్లాక్​ ఫంగస్​ కేసులు
  • వెల్లడించిన ఆ రాష్ట్ర హెల్త్​ మినిస్టర్​
  • మరణాల రేటు 50% ఉందని ఆందోళన
  • ప్రభుత్వం తరఫునే ట్రీట్​మెంట్​ ఇప్పించేందుకు కసరత్తులు 

ముంబై/బెంగళూరు: కరోనా పేషెంట్లను బ్లాక్​ఫంగస్​ కమ్మేస్తోంది. దేశమంతటా ఆ కేసులు పెరిగిపోతున్నాయి. ఒక్క మహారాష్ట్రలోనే 2 వేలకుపైగా బ్లాక్​ఫంగస్​ (మ్యూకర్​ మైకోసిస్​) కేసులున్నాయని ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి రాజేశ్​ తోపే వెల్లడించారు. కరోనా కేసులు ఎక్కువయ్యే కొద్దీ బ్లాక్​ఫంగస్​ బాధితులూ పెరిగే ముప్పు ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే  మెడికల్​ కాలేజీలకు అటాచ్​ చేసిన దవాఖాన్లలో బ్లాక్​ఫంగస్​ బాధితులకు ట్రీట్​మెంట్​ చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు.

మరణాల రేటు ఎక్కువ
బ్లాక్​ఫంగస్​ సోకిన వాళ్లలో మరణాల రేటు 50% దాకా ఉందని తోపే చెప్పారు. బాధితులను ఈఎన్టీ, కంటి డాక్టర్లు, న్యూరాలజిస్టులు ఇతర విభాగాల నిపుణులు చెక్ చేయాలన్నారు. మహాత్మా ఫూలే జన ఆరోగ్య యోజన కింద బ్లాక్​ఫంగస్​ బాధితులకు ట్రీట్​మెంట్​ చేయించేందుకు కసరత్తు చేస్తున్నామన్నారు. ట్రీట్​మెంట్​లో వాడే ‘యాంఫోటెర్సిన్​ బీ’ వంటి మందులకు ధరలు చాలా ఎక్కువగా ఉన్నాయని, వాటిని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రైసింగ్​ అథారిటీకి లేఖ రాస్తామని చెప్పారు. ముంబైలోని హాఫ్కిన్​ అనే కంపెనీ లక్ష యాంఫోటెర్సిన్​ బీ ఇంజెక్షన్ల తయారీకి టెండర్లను పిలుస్తుందని చెప్పారు. హైదరాబాద్​లో ఒక్క నెలలోనే 60 దాకా బ్లాక్​ఫంగస్​ కేసులు వచ్చాయి. ఆరుగురు చనిపోయారు. బ్లాక్​ఫంగస్​ కేసులపై కర్నాటక అలర్ట్​ అయింది. దేశంలో దాని బారిన పడిన కరోనా బాధితుల వివరాలను ఇవ్వాల్సిందిగా నిపుణులను ఆదేశించినట్టు ప్రభుత్వం పేర్కొంది.