- అర్హులు 2,66,676 మంది..
- ఇచ్చేది రూ. 304,49 కోట్లు
యాదాద్రి, వెలుగు : ప్రతి సీజన్ మాదిరిగానే వానాకాలం– 2023 సీజన్లోనూ యాదాద్రి జిల్లాలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య పెరిగింది. గత యాసంగి సీజన్లో 2,61,052 మంది లబ్ధిదారులు ఉండగా ఈసారి మరో 5,624 మంది పెరిగి 2,66,676 మందికి చేరింది. ఈ ఏడాది జూన్ 18 నాటికి పట్టాదారు పాస్బుక్స్ పొందిన రైతులు పాస్బుక్స్, ఆధార్ జిరాక్స్తో పాటు బ్యాంక్ అకౌంట్ నెంబర్, ఐఎఫ్ఎస్సీ కోడ్ నంబరు అగ్రికల్చర్ ఆఫీసర్లకు అందించాల్సి ఉంటుంది.
రైతుబంధుకు అర్హులైన రైతులకు పెట్టుబడి సాయంగా రూ.304,49,66,386 అందిస్తామని ఆఫీసర్లు తెలిపారు. అయితే కొత్తగా పాస్బుక్స్ పొందిన వారు 5,624 మంది అయితే ఆఫీసర్లు మాత్రం 12,666 మంది పొందినట్టుగా ప్రకటన విడుదల చేశారు. 2022–23 యాసంగి సీజన్ రైతుబంధు నాటికి పాస్బుక్స్ పొందిన 7,042 అకౌంట్లలో సర్కారు డబ్బు జమ చేయలేదు. అందుకే వారిని ఈ సీజన్లోనే పాస్బుక్స్ పొందినట్టుగా ప్రకటనలో పేర్కొన్నారు.
అందరికీ అందని రైతు బంధు
2018 ముందస్తు ఎన్నికల ముందు ప్రభుత్వం రైతుబంధు స్కీం ప్రారంభించింది. మొదట్లో ఎకరానికి రూ. 4 వేలు ఇస్తామని చెప్పిన సర్కారు.. ఆ తర్వాత ఎకరానికి రూ. 5 వేలు చేసింది. 2018 రెండు సీజన్లలో ఎకరాలతో సంబంధం లేకుండా చిన్నాపెద్ద రైతులందరి ఖాతాల్లో సొమ్ము జమ చేసింది. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ కనిపిస్తోంది. ప్రతి సీజన్లోనూ సీసీఎల్ఏ నుంచి వచ్చిన లిస్టులో రైతుల సంఖ్య పెరుగుతోంది. కానీ అదే స్థాయిలో ప్రతి సీజన్లో 20 వేల నుంచి 30 వేల మంది రైతు ఖాతాల్లో రైతుబంధు జమ కావడం లేదు.
గడిచిన యాసంగి సీజన్లో కొత్తగా పాస్బుక్స్ పొందిన వారితో పాటు 10 నుంచి 15 ఎకరాలు కలిగిన దాదాపు 30 వేల ఖాతాల్లో రైతుబంధు సొమ్ము జమకాలేదు. ఈ వానాకాలం సీజన్లో 2,66,676 మంది రైతుబంధుకు అర్హులుగా ప్రకటించినా అందులో ఎంతమందికి వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. కాగా 2018 వానాకాలం సీజన్ నుంచి 2022–23 యాసంగి సీజన్ నాటికి 21,35,088 ఖాతాల్లో రూ. 2,758.53 కోట్లు జమ కావాల్సి ఉండగా 19,50,268 ఖాతాల్లో రూ. 2,483.53 కోట్లు జమ అయింది. మరో 1,84,320 ఖాతాల్లో రూ. 327.47 కోట్లు జమ కాకుండా కోత పడింది.