కాలేజ్ క్యాంపస్‌లో యువతి గొంతు కోసిన క్లాస్‌మేట్

కాలేజ్ క్యాంపస్‌లో యువతి గొంతు కోసిన క్లాస్‌మేట్
  • పేపర్​ కట్టర్​తో అమ్మాయిపై క్లాస్​మేట్ దాడి
  • తీవ్రంగా గాయపడి మృతి చెందిన యువతి
  • కేరళలోని కొట్టాయం జిల్లాలో దారుణం

తిరువనంతపురం: అప్పుడే పరీక్ష రాసి బయటకొచ్చిన ఓ విద్యార్థినిపై తోటి స్టూడెంట్​ పేపర్​ కట్టర్​(కత్తి)తో దాడి చేసి చంపేశాడు.  కేరళలోని కొట్టాయం జిల్లాలో శుక్రవారం జరిగిందీ సంఘటన. ఎర్నాకులం జిల్లాలోని కూథట్టుకులం ప్రాంతానికి చెందిన అభిషేక్​ బైజు, థలయోలపరంబుకు చెందిన నితినమోల్ (22).. కొట్టాయం జిల్లాలోని పాలాలో ఉన్న సెయింట్​ థామస్​ కాలేజీలో ఫుడ్​ ప్రాసెసింగ్​కోర్సు ఫైనల్ ​ఇయర్​ చదువుతున్నారు. శుక్రవారం సప్లిమెంటరీ పరీక్షలు రాసేందుకు ఇద్దరూ కాలేజీకి వచ్చారు. ఎగ్జామ్​ అయిపోయాక నితినమోల్​ బయటకు రాగానే అభిషేక్​ అడ్డుకున్నాడని, పేపర్​ కట్టర్​తో గొంతు కోసేశాడని పోలీసులు తెలిపారు. గాయపడిన అమ్మాయిని కొందరు స్టూడెంట్లు వెంటనే స్థానిక హాస్పిటల్​కు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయిందని డాక్టర్లు చెప్పారన్నారు. 

పారిపోకుండా అక్కడే కూర్చొని..

‘కాలేజీ ఆవరణలో నిందితుడు అమ్మాయితో గొడవపడటం చూశాను. అతను ఆమెను కింద పడేసి గొంతు కోశాడు. అమ్మాయి గొంతు నుంచి రక్తం కారడం గమనించి వెంటనే ప్రిన్సిపాల్​కు ఫోన్​ చేశాను’ అని కాలేజీ సెక్యూరిటీ గార్డు చెప్పారు. దాడి చేశాక అభిషేక్​ పారిపోలేదని, కొద్ది దూరంలో కూర్చుండిపోయాడని, పోలీసులు వచ్చే వరకు అక్కడే ఉన్నాడని చెప్పారు. నిందితున్ని అదుపులోకి తీసుకున్నామని  పోలీసులు చెప్పారు.