
- 37,257కి చేరిన కరోనా బాధితులు
- మహారాష్ట్రలోనూ తొలిసారి ఒక్కరోజులో వెయ్యి మందికి పాజిటివ్
- పది వేలు దాటిన కోలుకున్నోళ్ల సంఖ్య.. 1,223 మంది మృతి
న్యూఢిల్లీ: దేశంలో కేసులు శుక్రవారం రికార్డుస్థాయిలో పెరిగిపోయాయి. ఒక్కరోజులో ఏకంగా 2,391 కేసులు నమోదయ్యాయి. ఇప్పటిదాకా ఒక్కరోజులో నమోదైన హయ్యెస్ట్ కేసులివే. అంతకుముందు ఏప్రిల్ 28న 1,902 కేసులు రిపోర్ట్ అయ్యాయి. ఒక్క మహారాష్ట్రలోనే వెయ్యి కొత్త కేసులు నమోదయ్యాయి. ఒక్కరోజులో వెయ్యి కేసులు నమోదైన తొలి రాష్ట్రంగా మహారాష్ట్ర నిలిచింది. శుక్రవారం 1,008 కేసులు అక్కడ రిపోర్ట్ అయ్యాయి. ఆ రాష్ట్రంలో ఇప్పటిదాకా నమోదైన హయ్యెస్ట్ కేసులు కూడా ఇవే. కరోనా నుంచి కోలుకున్నోళ్ల సంఖ్య కూడా పది వేలు దాటింది. శుక్రవారం 946 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జి కాగా, మొత్తం 10,005 మంది కోలుకున్నారు. దేశవ్యాప్తంగా కేసుల సంఖ్య 37,257కి చేరింది. ఇప్పటిదాకా 1,223 మంది చనిపోగా, శుక్రవారం 69 మంది బలయ్యారు. 26,025 మంది ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు.