24 గంటలు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ట్రాఫిక్ ...జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్

24 గంటలు డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు ట్రాఫిక్ ...జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్

బషీర్​బాగ్​, వెలుగు: ఇక నుంచి రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలూ డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు నిర్వహిస్తామని హైదరాబాద్​ ట్రాఫిక్​ జాయింట్​ కమిషనర్​ జోయల్​ డేవిస్​ స్పష్టం చేశారు. బుధవారం సాయంత్రం మింట్ కాంపౌండ్ లో డ్రంకెన్​ డ్రైవ్​ టెస్టులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో జోయల్​ డేవిస్​ పాల్గొని మాట్లాడారు. ఇటీవల స్కూల్స్ వద్ద చేపట్టిన స్పెషల్ డ్రైవ్ లో 35 డ్రంకెన్​ డ్రైవ్​ కేసులు నమోదయ్యాయన్నారు. అందుకే ఉదయం పూట కూడా తనిఖీలు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. 

ఇంతకు ముందు కేవలం రాత్రివేళల్లో మాత్రమే డ్రంకెన్​ డ్రైవ్​ తనిఖీలు ఉండేవని, ఇక నుంచి ఎప్పుడైనా, ఎక్కడైనా సర్​ప్రైజ్​ టీంలు తనిఖీలు చేస్తాయని చెప్పారు. స్కూల్​ బస్​ డ్రైవర్లపై యాజమాన్యాలు ప్రత్యేక దృష్టి  పెట్టాలని  సూచించారు. బ్రీత్​ ఎనలైజర్​తో టెస్టులు చేశాక బస్సులు చేతికివ్వాలని చెప్పారు. తనిఖీల్లో ట్రాఫిక్ డీసీపీ శ్రీనివాస్, అడిషనల్ డీసీపీ రాములు, ఏసీపీ మోహన్, సైఫాబాద్ ట్రాఫిక్  సీఐ సైదిరెడ్డి పాల్గొన్నారు.

పద్మారావునగర్​లో 10 కేసులు..

పద్మారావునగర్: పద్మారావునగర్​ చౌరస్తా వద్ద బుధవారం సాయంత్రం డ్రంకెన్​ డ్రైవ్​ నిర్వహించారు. మద్యం సేవించి బైక్​ నడుపుతున్న 10 మందిపై కేసులు నమోదు చేసినట్లు చిలకలగూడ ట్రాఫిక్​ ఇన్ స్పెక్టర్ శ్రీనివాసులు తెలిపారు.

కులుసుంపుర పీఎస్​ పరిధిలో 11 కేసులు..

మెహిదీపట్నం: కులుసుంపుర పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఇన్​స్పెక్టర్ అంజయ్య ఆధ్వర్యంలో మొగల్ కానాల చౌరస్తా వద్ద బుధవారం మధ్యాహ్నం డ్రంకెన్​ డ్రైవ్  స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ఇందులో 11 మంది పట్టుబడగా వారిపై కేసులు నమోదు చేశారు.