- హర్యానాలోని ఫరీదాబాద్లో ప్రారంభించిన మోడీ
- తొలిదశలో 500 బెడ్లు అందుబాటులోకి..
ఫరీదాబాద్(హర్యానా): ఆసియాలోనే అతిపెద్ద ప్రైవేట్ హాస్పిటల్ ‘అమృత హాస్పిటల్’ను బుధవారం ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభించారు. మాతా అమృతానందమయితో కలిసి ఈ ఆస్పత్రిని ప్రారంభించడం సంతోషంగా ఉందని ప్రధాని చెప్పారు. ఫరీదాబాద్లో నిర్మిస్తున్న అత్యాధునిక టెక్నాలజీ, ఫుల్లీ ఆటోమేటెడ్ ల్యాబొరేటరీ కలిగిన ప్రైవేట్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆసియాలోనే అతిపెద్దదిగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇండియాలో ఆరోగ్యం, ఆధ్యాత్మికత మధ్య ఎంతో దగ్గర సంబంధం ఉందని అన్నారు. దీనికి కరోనా పర్ఫెక్ట్ ఉదాహరణ అని చెప్పారు. ఆధ్యాత్మికత, ప్రైవేటు భాగస్వామ్యంతోనే కరోనా మహమ్మారిపై విజయం సాధించామని గుర్తుచేశారు. కరోనాపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేశామని తెలిపారు. హెల్త్కేర్ సెక్టార్లో టెక్నాలజీకి ఎంతో ప్రాధాన్యత ఉందన్నారు. టెక్నాలజీ, ఆధునికీకరణ అనే అంశాలు ఇండియా హెల్త్కేర్ రంగం అభివృద్ధిలో కీలకమని వివరించారు. “అమ్మ ప్రేమ, కరుణ, సేవ, త్యాగ స్వరూపం. ఆమె భారతదేశ ఆధ్యాత్మిక సంప్రదాయానికి మూలం” అని మాతా అమృతానందమయిని ప్రధాని మోడీ ప్రశంసించారు.
81 స్పెషాలిటీస్తో ఏర్పాటు..
అమృత హాస్పిటల్ను మొత్తం 81 స్పెషాలిటీస్తో ఏర్పాటుచేసినట్లు హాస్పిటల్స్ గ్రూప్ మెడికల్ డైరెక్టర్ డాక్టర్ ప్రేమ్ నాయర్ చెప్పారు. ఈ హాస్పిటల్లో ముందుగా 500 బెడ్స్ను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రాబోయే ఐదేండ్లలో దశలవారీగా పూర్తి స్థాయిలో సేవలు అందించనున్నారు. ప్రారంభోత్సవంలో హర్యానా గవర్నర్ దత్తాత్రేయ, సీఎం మనోహర్ లాల్ ఖట్టర్, మాతా
అమృతానందమయి తదితరులు హాజరయ్యారు.
ఆస్పత్రి విశేషాలు..
- 130 ఎకరాల్లో 14 ఫ్లోర్లతో ఏర్పాటు
- ఏడు అంతస్తుల బిల్డింగ్లో రీసెర్చ్ సెంటర్
- పేషెంట్ల తరలింపునకు హెలీప్యాడ్
- 2600 పడకల సామర్థ్యం
- 534 క్రిటికల్ కేర్ బెడ్లు
- 64 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు
- తల్లీబిడ్డల సంరక్షణ కోసమే ప్రత్యేకంగా ఓ ఫ్లోర్ కేటాయింపు
- 800 మంది డాక్టర్లు, 2500 మంది పారామెడికల్ స్టాఫ్
- రోగుల కుటుంబ సభ్యుల కోసం 498 రూమ్ల గెస్ట్హౌస్
- క్యాంపస్లోనే మెడికల్ కాలేజీ