న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ అక్టోబర్ 1 నుంచి అమలులోకి వస్తుందని ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఢిల్లీ, గోవా వంటి కొన్ని రాష్ట్రాలు 28 శాతం జీఎస్టీ విధింపును రివ్యూ చేయాలని కోరినప్పటికీ బుధవారం సమావేశంలో జీఎస్టీ కౌన్సిల్ ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు చెప్పారు. ఆన్లైన్ గేమింగ్పై పన్ను విధింపునకు వీలు కల్పించేలా తీసుకు రావల్సిన సవరణలపైనా జీఎస్టీ కౌన్సిల్లో చర్చ జరిగిందని అన్నారు.
బెట్స్ మొత్తం ఫేస్ వాల్యూ (బెట్టింగ్ చేసే మొత్తం) పైన 28 శాతం జీఎస్టీ విధించాలనే నిర్ణయానికి జీఎస్టీ కౌన్సిల్ కిందటి మీటింగ్లోనే వచ్చింది. అయితే, చట్టంలో తీసుకు రావల్సిన సవరణల కోసం బుధవారం జీఎస్టీ కౌన్సిల్ మరోసారి సమావేశమైంది. ఆన్లైన్ గేమింగ్పై 28 శాతం జీఎస్టీ విధింపును ఢిల్లీ ఫైనాన్స్ మినిస్టర్ వ్యతిరేకించారని, మరోవైపు గోవా, సిక్కిం రాష్ట్రాలు ఫుల్ ఫేస్ వాల్యూపై కాకుండా గ్రాస్ గేమింగ్ రెవెన్యూపై జీఎస్టీ విధించాలని కోరాయని నిర్మలా సీతారామన్ చెప్పారు.
కర్నాటక, గుజరాత్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాలు జీఎస్టీ కౌన్సిల్ అంతకు ముందు సమావేశంలో తీసుకున్న నిర్ణయాన్నే అమలు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. చట్టంలో సవరణలు పూర్తయ్యాక, అక్టోబర్1 నుంచి 28 శాతం జీఎస్టీ అమలులోకి వస్తుందని, అక్కడి నుంచి ఆరు నెలల తర్వాత అమలును రివ్యూ చేస్తామని నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.