- జీఎస్టీ 18% నుంచి ఐదు శాతానికి కుదిస్తూ నిర్ణయం
- ఎంయూవీలపై 22% కాంపెన్సేషన్ సెస్
న్యూఢిల్లీ: ఆన్లైన్ గేమింగ్, హార్స్ రేసింగ్, కేసినోలపై 28 శాతం జీఎస్టీ విధించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. ఆన్లైన్ గేమింగ్ కంపెనీల టర్నోవర్పైనే ఈ పన్ను విధించాలని నిర్ణయం తీసుకున్నట్లు ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ వెల్లడించారు. జీఎస్టీ కౌన్సిల్50 వ మీటింగ్ మంగళవారం జరిగింది. కిందటి సమావేశంలోనే ఈ అంశంపై గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్కు ఒక అంగీకారం కుదిరినప్పటికీ, ఆన్లైన్ గేమింగ్పై గోవా ప్రభుత్వం ప్లాట్ఫామ్ ఫీజు కింద 18 శాతాన్ని ప్రతిపాదించడంతో ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. గేమ్ ఆఫ్ స్కిల్, గేమ్ ఆఫ్ ఛాన్స్లు రెండింటినీ ఒకలాగే పరిగణించడానికి జీఎస్టీ కౌన్సిల్ ఒప్పుకుంది. గేమింగ్ ఫుల్ వాల్యూ మీద, హార్స్రేసింగ్, కేసినోలో గెలిచిన మొత్తం మీదా 28 శాతం జీఎస్టీ విధింపు గేమింగ్ ఇండస్ట్రీపై గ్రోత్ను దెబ్బతీస్తుందని ఎన్ఏ షా అసోసియేట్స్ పార్ట్నర్ పరాగ్ మెహతా చెప్పారు. 28 శాతం జీఎస్టీ చాలా ఎక్కువని, అంత పన్ను భరించడం ఏ పరిశ్రమ వల్లా కాదని కొన్ని ఆన్లైన్ గేమింగ్ కంపెనీలు సీబీఐసీకి విజ్ఞప్తి చేశాయి.
థియేటర్లో అమ్మే తినుబండారాలపై స్పష్టత...
సినిమా టికెట్ల అమ్మకం, థియేటర్లో అమ్మే పాప్కార్న్, కూల్డ్రింక్స్వంటి వాటిపై జీఎస్టీ విధింపులో జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత తీసుకు వచ్చింది. సినిమా టికెట్లతో క్లబ్ చేసి అమ్మే తినుబండారాలను కాంపోజిట్ సప్లయ్గా పరిగణించాలని, సినిమా టికెట్లపై ఉండే జీఎస్టీ రేటే తినుబండారాలపైనా వర్తిస్తుందని జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత ఇచ్చింది. కానీ, విడిగా కొనుక్కునే ఫుడ్ ఐటమ్స్పై మాత్రం జీఎస్టీ 5 శాతమే ఉంటుంది. సినీప్లెక్స్లలోని రెస్టారెంట్లపై ఇక మీదట 5 శాతం జీఎస్టీ విధించనున్నారు. ఇప్పటిదాకా వాటిపై 18 శాతం జీఎస్టీ ఉంది. ఈ మార్పు తేవడానికి ముందు, సినిమా టికెట్ రూ. 100 లోపుంటే 12 శాతం జీఎస్టీ, అంతకు మించితే 18 శాతం జీఎస్టీ అమలవుతోంది. అన్కుక్డ్ ఫుడ్ పాలెట్, ఫిష్ సాల్యుబుల్ పేస్ట్ వంటి వాటిపై గతంలోని 18 శాతం జీఎస్టీని తాజాగా 5 శాతానికి తగ్గించారు.
కేన్సర్ డ్రగ్స్కు మినహాయింపు....
కేన్సర్ చికిత్సలో వాడే డినుటుక్సిమాబ్ (దిగుమతి చేసుకునే మెడిసిన్) పై జీఎస్టీ మినహాయించాలని కౌన్సిల్ నిర్ణయించింది. అదేవిధంగా, కొన్ని ప్రత్యేక వ్యాధుల ట్రీట్మెంట్కోసం ఉపయోగించే ఫుడ్ ఫర్ స్పెషల్ మెడికల్ పర్పసెస్ (ఎఫ్ఎస్ఎంపీ)పై కూడా మినహాయింపు అమలు చేయనున్నారు. ఇప్పటిదాకా వాటిపై 12 శాతం ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ అమలులో ఉండేది.
యుటిలిటీ వెహికల్స్ పైనా క్లారిటీ....
యుటిలిటీ వెహికల్స్పై జీఎస్టీ అంశంలోనూ జీఎస్టీ కౌన్సిల్ స్పష్టత తీసుకొచ్చింది. యుటిలిటీ వెహికల్స్ డెఫినిషన్పై ఒక నిర్ణయం తీసుకోవడంతోపాటు, రిజిస్ట్రేషన్ రూల్స్ను కూడా కఠినం చేసింది. ఎంయూవీలపై 22 శాతం కాంపెన్సేషన్ సెస్ ప్రపోజల్ను జీఎస్టీ కౌన్సిల్ ఆమోదించింది. కానీ, సెడాన్లను ఈ లిస్ట్లో చేర్చలేదు. సెడాన్లను చేరిస్తే వాటిపై జీఎస్టీ పెరుగుతుందని పంజాబ్, తమిళనాడు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు.ప్రైవేటు కంపెనీలు అందించే శాటిలైట్ లాంఛ్ సర్వీసులపైనా జీఎస్టీ మినహాయంపు ఇవ్వనున్నారు..