టెస్టింగ్ దశలో మూడు వ్యాక్సిన్లు
న్యూఢిల్లీ: ఎర్రకోటలో 74వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా కరోనా వ్యాక్సిన్ గురించి ప్రధాని మోడీ పలు ఆసక్తికర విషయాలు మాట్లాడారు. ఇండియాలో మూడు వ్యాక్సిన్లు అభివృద్ధి దశల్లో ఉన్నాయని, అవి వివిధ టెస్టింగ్ స్టేజెస్లో ఉన్నట్లు చెప్పారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ ఉత్పత్తికి సంబంధించి రోడ్మ్యాప్ను సిద్ధం చేస్తున్నామని తెలిపారు. సైంటిస్టులు, నిపుణుల సూచన ప్రకారం అతి త్వరలోనే మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ను తీసుకొస్తామన్నారు.
దేశంలో వ్యాక్సిన్ను అందరికీ పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. ‘ఇండియాలో మూడు కరోనా వైరస్ వ్యాక్సిన్లు పలు టెస్టింగ్ దశల్లో ఉన్నాయి. దేశ ప్రజలకు వాటి పంపిణీ, ఉత్పత్తికి సంబంధించి రోడ్మ్యాప్ కూడా సిద్ధంగా ఉంది. ప్రతి భారతీయుడికి కరోనా వ్యాక్సిన్ అందిస్తామని ప్రభుత్వం హామీ ఇస్తోంది’ అని మోడీ వివరించారు.