
పర్వతగిరి(గీసుగొండ): మనస్తాపంతో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. సీఐ మహేందర్ తెలిపిన ప్రకారం.. వరంగల్జిల్లా గీసుగొండ మండలం రెడ్డిపాలెం గ్రామానికి చెందిన వరగాని సత్యం(40) భూమిని కౌలుకు తీసుకుని సాగు చేస్తుండగా పంటలు సరిగా పండడంలేదు. అంతేకాకుండా అతని భార్యకు అస్తమా ఉండడంతో వైద్యానికి, ఇద్దరు పిల్లల చదువులకు రూ. 6 లక్షలు అప్పు చేశాడు. ఎలా తీర్చాలో తెలియడం లేదంటూ కుటుంబసభ్యులకు చెప్పుకునేవాడు.
ఈనెల1న మొగిలిచర్ల శివారులోని కెనాల్ వద్ద గుర్తు తెలియని గడ్డి మందు తాగి కొడుకు యశ్వంత్ కు చెప్పాడు. వెంటనే ఎంజీఎంకు తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడి భార్య ఏకాంబరం ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.
మంచిర్యాల జిల్లాలో యువకుడు..
జైపూర్(భీమారం): మంచిర్యాల జిల్లాలో ఆర్థిక ఇబ్బందులతో యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భీమారం మండల కేంద్రానికి చెందిన గంట్ల రజిత, -జైరామ్ రెడ్డి దంపతుల రెండో కొడుకు మణికంఠరెడ్డి(24), హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ సంస్థలో జాబ్ చేస్తున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరు కూతుళ్ల పెండ్లిళ్లు చేయడంతో కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు వచ్చాయి. దీంతో మనస్తాపం చెందిన మణికంఠరెడ్డి రెండు రోజుల కింద గడ్డి మందు తాగాడు.
కుటుంబ సభ్యులు వెంటనే కరీంనగర్ ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా ట్రీట్ మెంట్ తీసుకుంటూ శనివారం రాత్రి చనిపోయాడు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్వేత తెలిపారు.
సిద్దిపేట జిల్లాలో మరొకరు..
జగదేవపూర్ (కొమురవెల్లి): భార్య కాపురానికి రావట్లేదని భర్త ఆత్మహత్య చేసుకున్న ఘటన సిద్దిపేట జిల్లాలో జరిగింది. జగదేవపూర్ మండలం నిర్మల్ నగర్ గ్రామానికి చెందిన కర్రె కిరణ్ (27), ఐదేండ్ల కింద ప్రేమ పెండ్లి చేసుకుని భార్యతో కలిసి జగదేవపూర్ లో ఉంటున్నాడు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఇటీవల భార్యతో మనస్పర్థలు తలెత్తడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రాకపోవడంతో కిరణ్ శనివారం సాయంత్రం ఇంట్లో స్లాబ్ కు ఉరేసుకుని చనిపోయాడు. మృతుడి తండ్రి మల్లేశ్ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు.