
- ఐటీఆర్ డెడ్లైన్ను పొడిగించం
- వీలున్నంత తొందరగా ట్యాక్స్ రిటర్న్లను ఫైల్ చేసుకోవాలన్న రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్రా
- ట్యాక్స్ కలెక్షన్ టార్గెట్ చేరుకుంటామని వెల్లడి
న్యూఢిల్లీ : ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్లను ఫైల్ చేయడానికి ఈ నెల 31 డెడ్లైన్ అని, ఈ డేట్ను పొడిగించే ఆలోచన ప్రభుత్వానికి లేదని రెవెన్యూ సెక్రెటరీ సంజయ్ మల్హోత్రా ట్యాక్స్ పేయర్లను హెచ్చరించారు. ఐటీఆర్ ఫైలింగ్ వేగంగా పూర్తి చేయాలని సలహా ఇచ్చారు. కిందటేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఐటీఆర్ ఫైలింగ్ ఎక్కువగా ఉంటుందని అంచనావేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. కిందటేడాది జులై 31 నాటికి ఏకంగా 5.83 కోట్ల ఐటీఆర్ ఫైలింగ్స్ జరిగాయని చెప్పారు. 2022–23 అసెస్మెంట్ ఇయర్కు ఈ నెల 31 చివరి తేదీ అని గుర్తు చేశారు. కిందటేడాదితో పోలిస్తే ఈసారి ఐటీఆర్ ఫైలింగ్స్ వేగంగా జరగుతున్నాయని, చివరి తేదీ వరకు వెయిట్ చేయొద్దని ట్యాక్స్ పేయర్లకు సలహా ఇచ్చారు.
ట్యాక్స్ కలెక్షన్ గురించి మల్హోత్రా మాట్లాడుతూ.. టార్గెట్ పెట్టుకున్న గ్రోత్ను సాధిస్తామని అన్నారు. 10.5 శాతం గ్రోత్ రేట్ సాధించాలని టార్గెట్గా పెట్టుకున్నామని చెప్పారు. జీఎస్టీ కలెక్షన్స్ గ్రోత్ రేటు ఇప్పటి వరకు 12 శాతంగా ఉందని వివరించారు. ఎక్సైజ్ డ్యూటీ విభాగంలో కలెక్షన్స్ తగ్గిపోయే అవకాశం ఉందని, దీనికి కారణం రేట్లను తగ్గించడమేనని మల్హోత్రా పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఎక్సైజ్ డ్యూటీ విభాగంలో నెగెటివ్ గ్రోత్ నమోదయ్యిందని, ముందుకెళ్లే కొద్దీ పరిస్థితుల్లో మార్పు రావొచ్చని ఆశాభావం వ్యక్తం చేశారు. ట్యాక్స్ రేట్ల తగ్గింపు ప్రభావం పోతే ఎక్సైజ్ డ్యూటీ కలెక్షన్ పెరుగుతుందన్న నమ్మకం ఉందని చెప్పారు. కాగా, 2023–24 బడ్జెట్ అంచనాల ప్రకారం, ట్యాక్స్ కలెక్షన్ రూ.33.61 లక్షల కోట్లుగా ఉంటుందని ప్రభుత్వం అంచనావేస్తోంది.
కార్పొరేట్, ఇండివిడ్యువల్ ఇన్కమ్ ట్యాక్స్ ద్వారా రూ.18.23 లక్షల కోట్లు సేకరించాలని టార్గెట్గా పెట్టుకుంది. కిందటి ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఇది 10.5 శాతం ఎక్కువ. కస్టమ్స్ డ్యూటీ ద్వారా వచ్చే రెవెన్యూ 11 శాతం పెరిగి రూ.2.33 లక్షల కోట్లకు పెరుగుతుందని ప్రభుత్వం అంచనావేస్తోంది. ముందు ఈ టార్గెట్ రూ.2.10 లక్షల కోట్లుగా అంచనా వేయగా, తర్వాత సవరించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ వసూళ్లు 12 శాతం పెరిగి రూ.9.56 లక్షల కోట్లు వస్తాయని అంచనావేశారు. డైరెక్ట్, ఇన్డైరెక్ట్ ట్యాక్స్ కలెక్షన్స్ కలుపుకొని ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.33.61 లక్షల కోట్లు సేకరించాలని కేంద్రం టార్గెట్గా పెట్టుకుంది. అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో రూ.30.43 లక్షల కోట్లు వచ్చాయి.