
- 90 శాతం పూర్తయిన మరో 91 వేల ఇళ్లు
- వేగంగా డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం
- గృహ నిర్మాణ సంస్థ ఎండీ, స్పెషల్ సీఎస్ చిత్రా రాంచంద్రన్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం వేగంగా జరుగుతోందని గృహ నిర్మాణ సంస్థ ఎండీ, స్పెషల్ సీఎస్ చిత్రా రామచంద్రన్ తెలిపారు. ఇప్పటికే 32,008 ఇళ్లు పూర్తయ్యాయని, 91,306 ఇళ్లు 90% మేర పూర్తయ్యాయని చెప్పారు. ఈమేరకు మంగళవారం ఆమె పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఇప్పటిదాకా వీటి కోసం ₹6,141 కోట్లు ఖర్చు చేసినట్టు తెలిపారు. బిల్లులు సమర్పించిన 15 రోజుల్లోగా కలెక్టర్ అనుమతితో కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లిస్తున్నామన్నారు. బిల్లుల చెల్లింపుల్లో పారదర్శకత, జవాబుదారీతనం కోసం ఆన్లైన్ ప్రాజెక్ట్ మానిటరింగ్ సిస్టం (ఓపీఎంఎస్) ప్రవేశపెట్టామన్నారు. కాంట్రాక్టర్లకు ప్రభుత్వం ఇసుకను ఉచితంగా అందించడంతో పాటు సిమెంట్, స్టీల్ను తక్కువ ధరకే ఇప్పిస్తోందని చెప్పారు. ఇళ్ల నిర్మాణంపై పక్క రాష్ట్రాలు, జాతీయ స్థాయి అధికారులు మెచ్చుకుంటున్నారని ఆమె చెప్పారు. ఏపీ అధికారులూ ప్రాజెక్ట్లను పరిశీలించారని, అక్కడా దానిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోబోతున్నారని తెలిపారు.