40 కోట్లు దాటిన జియో మొబైల్​ కస్టమర్లు

40 కోట్లు దాటిన జియో మొబైల్​ కస్టమర్లు

హైదరాబాద్​, వెలుగు: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్​లలో జియో కొత్తగా 3.27 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను సంపాదించుకుంది. మే 2022లో జియో ఈ కొత్త సబ్​స్క్రయిబర్లను పొందినట్లు ట్రాయ్​ (టెలికం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్​ ఇండియా) డేటా తెలిపింది. ఇదే నెలకు భారతీ ఎయిర్​టెల్​ 71,312 మంది కొత్త మొబైల్​ సబ్​స్క్రయిబర్లను సాధించగా, వోడాఫోన్​ 74,808 మంది, బీఎస్​ఎన్​ఎల్​ 78,423 మంది సబ్​స్క్రయిబర్లను పోగొట్లుకున్నాయి. దేశవ్యాప్తంగా చూస్తే మే నెలలో జియో 31.11 లక్షల కొత్త సబ్​స్క్రయిబర్లను ఆకట్టుకుంది. దీంతో ఆ కంపెనీ మొత్తం మొబైల్​ కస్టమర్ల సంఖ్య 40.87 కోట్లకు చేరింది. మే నెలలో 10.27 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను పొందిన భారతీ ఎయిర్​టెల్​ తన మొత్తం కస్టమర్ల సంఖ్యను 36.31 కోట్లకు పెంచుకోగలిగింది. మరోవైపు 7.5 లక్షల మందిని పోగొట్టుకున్న వోడాఫోన్​ కస్టమర్లు 25.84 కోట్లకు తగ్గిపోయారు. 53.62 లక్షల మంది సబ్​స్క్రయిబర్లను కోల్పోయిన బీఎస్​ఎన్​ఎల్​ కూడా 11.28 కోట్ల కస్టమర్లతో సరిపెట్టుకుంది.