మధ్యప్రదేశ్లోని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ సంచలన నిర్ణయం తీసుకుంది. 39 మంది నేతలపై చర్యలు తీసుకుంది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని రద్దు చేసి.. ఆరేళ్ల పాటు బహిష్కరణ వేటు వేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారన్న ఉద్దేశంతోనే చర్యలు తీసుకుంది. ఈ మేరకు మధ్యప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు కమల్నాథ్, ఉపాధ్యక్షుడు రాజీవ్ సింగ్ ఆదేశాలు జారీ చేశారు.
మాజీ ఎంపీ ప్రేమ్చంద్ గుడ్డూ, మాజీ ఎమ్మెల్యేలు అంతార్ సింగ్ దర్బార్, యడ్వేంద్ర సింగ్, మధ్యప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ సింగ్ యాదవ్, సీనియర్ నేతలు నజీర్ ఇస్లామ్, అమిర్ అక్వీల్ తదితరులు బహిష్కరణకు గురైన నేతల్లో ఉన్నారు.
బహిష్కరణకు గురైన నాయకుల్లో కొందరు స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేస్తుండగా, మరికొందరు బహుజన్ సమాజ్ పార్టీ, సమాజ్వాదీ పార్టీ, ఆమ్ ఆద్మీ పార్టీ ఆప్ టిక్కెట్పై ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 230 మంది సభ్యులున్న మధ్యప్రదేశ్ అసెంబ్లీకి 2023 నవంబర్ 17న ఎన్నికలు జరగనున్నాయి.
ALSO READ :- NZ vs PAK: పఖర్ జమాన్ మెరుపు సెంచరీ.. ఛేదనలో ధీటుగా బదులిస్తోన్న పాక్