న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న నేపథ్యంలో వ్యాక్సిన్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో వ్యాక్సిన్ విషయంపై పార్లెమెంట్లో కేంద్ర ఆరోగ్య మంత్రి హర్ష వర్దన్ కొంత స్పష్టతను ఇచ్చారు. ఇండియాలో నాలుగుకు పైగా కరోనా వ్యాక్సిన్లు ప్రీ క్లినికల్ ట్రయల్స్ దశలో ఉన్నాయని తెలిపారు. వ్యాక్సిన్ అభివృద్ధి కోసం అవసరమైన అన్ని సహాయ సహకారాలను ప్రభుత్వం అందిస్తోందన్నారు.
‘ప్రపంచవ్యాప్తంగా 145 మంది వ్యాక్సిన్ క్యాండిడేట్స్ ప్రీ క్లినికల్, 35 మంది క్లినికల్ ట్రయల్స్ నిర్ధారణలో ఉన్నారు. ఇండియాలో 30 మంది వ్యాక్సిన్ క్యాండిడేట్స్కు అవసరమైన సపోర్ట్ను అందిస్తున్నాం. వీరిలో ముగ్గురు అడ్వాన్స్డ్ ట్రయల్స్ ఫేజెస్ 1, 2, 3లో.. మరో నలుగురు ప్రీ క్లినికల్ ట్రయల్లో ఉన్నారు. జనవరి 30న వైరస్ గురించి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రపంచాన్ని హెచ్చరించింది. కానీ అదే నెల 8న మేం వ్యాక్సిన్ సంబంధిత పనులను ప్రారంభించాం. జనవరి 17 నాటికి ఎంట్రీ సర్వైలెన్స్, కమ్యూనిటీ సర్వైలెన్స్కు సంబంధించిన సూచనలను ఇచ్చాం. ఇవ్వాళ కూడా 40 లక్షల మందిని కమ్యూనిటీ సర్వైలెన్స్లో ఉంచాం. ఇప్పటికి కోటి మందికి కాంటాక్ట్ ట్రేసింగ్ నిర్వహించాం. వారిలో 15 లక్షల మందిని ఎయిర్పోర్ట్స్లో స్క్రీనింగ్ చేశాం’ అని హర్ష వర్దన్ పేర్కొన్నారు.