యంగ్‍ ఇండియాలో  ఓరుగల్లుకు ప్రాధాన్యం

యంగ్‍ ఇండియాలో  ఓరుగల్లుకు ప్రాధాన్యం

 

  • జాబితాలో వరంగల్‍ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్‍
  • తొలి విడతలో 6 నియోజకవర్గాలకు కేటాయింపు 
  • పశ్చిమలో కాకతీయ యూనివర్సిటీ భూముల్లో నిర్మించే ఆలోచన
  • వర్ధన్నపేట స్కూల్‍ కోసం హసన్‍పర్తి, పైడిపల్లి భూముల పరిశీలన

వరంగల్‍, వెలుగు: ప్రభుత్వం యంగ్‍ ఇండియా ఇంటిగ్రేటెడ్‍ రెసిడెన్షియల్‍ స్కూల్స్ (వైఈఈఆర్‍ఎస్‍) ఏర్పాటులో ఓరుగల్లుకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చింది. బుధవారం 20 స్కూళ్లకు అడ్మినిస్ట్రేషన్‍ సాంక్షన్లు ఇవ్వగా ఉమ్మడి జిల్లా నుంచి వరంగల్‍ పశ్చిమ, వర్ధన్నపేట, పాలకుర్తి, మహబూబాబాద్‍ లకు చోటు లభించింది. మొదటి జాబితాలోనూ ఇక్కడి నుంచి 6 నియోజకవర్గాలకు అవకాశం కల్పించారు. ఒక్కో స్కూల్‍ నిర్మాణానికి 20 నుంచి 25 ఎకరాల స్థలం అవసరం ఉండగా సర్కార్​ప్రతీ పాఠశాల నిర్మాణానికి రూ.200 కోట్లు ఖర్చు చేయనుంది. 

12 నియోజకవర్గాలుంటే 10 చోట్ల..

ఓరుగల్లు అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెడతానని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన సీఎం రేవంత్‍రెడ్డి.. ఆ మాట నిలబెట్టుకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలోని 12 నియోజకవర్గాల్లో 11చోట్ల అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే ఉన్నారు. 2 ఎంపీ స్థానాలు సైతం కాంగ్రెస్​కే దక్కాయి. గతేడాది అక్టోబర్‍ లో యంగ్‍ ఇండియా స్కూళ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా మొదటి జాబితాలో వరంగల్‍ తూర్పు, పరకాల, నర్సంపేట, స్టేషన్‍ ఘనపూర్‍, ములుగు, భూపాలపల్లి నియోజకవర్గాలకు అవకాశమిచ్చారు. ప్రస్తుతం రెండో జాబితాలో 20 స్కూల్స్​ఉండగా.. ఉమ్మడి జిల్లాలోని మరో 4 నియోజకవర్గాలకు స్థానం కల్పించారు.  దీంతో జనగామ, డోర్నకల్‍ తప్పితే అన్ని నియోజకవర్గాలకు యంగ్‍ ఇండియా స్కూల్స్​దక్కినట్లయింది.

కేయూకు 600 ఎకరాల భూములు

గ్రేటర్‍ వరంగల్‍ పరిధిలో వరంగల్‍ తూర్పు, పశ్చిమ నియోజకవర్గాలు ఉన్నాయి. యంగ్‍ ఇండియా ఇంటిగ్రేటెడ్‍ రెసిడెన్షియల్‍ స్కూల్స్​ఏర్పాటుకు మొదటి జాబితాలో సిటీ నుంచి వరంగల్‍ తూర్పు నియోజకవర్గానికి అవకాశం దక్కింది. వరంగల్‍ పశ్చిమ పరిధిలోని హనుమకొండ సిటీలో 20 నుంచి 25 ఎకరాల ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకపోవడం సమస్యగా మారింది. ఈ క్రమంలో స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‍రెడ్డి తన నియోజకవర్గానికి యంగ్‍ ఇండియా స్కూల్‍ కోసం ప్రత్యేక చొరవ తీసుకున్నారు. మేధావులు, విద్యావేత్తలతో మాట్లాడి కాకతీయ యూనివర్సిటీలో  స్కూల్‍ ఏర్పాటు ఆలోచన చేశారు.

కేయూకు గతంలో 1,200 ఎకరాల భూములుండగా.. గడిచిన 45 ఏండ్లలో కబ్జాలు, అక్రమ నిర్మాణాల తర్వాత ఇప్పుడు 600 నుంచి 650 ఎకరాలున్నాయి. పలివేల్పుల, గుండ్లసింగారం, హనుమాన్‍నగర్‍ వైపు కబ్జాల నుంచి భూములు వెనక్కి తీసుకునేలా గత కొన్ని నెలలుగా అడుగులు వేస్తున్నారు. భీమారం, పలివేల్పుల వైపు ఉన్న కేయూ భూముల్లో మొన్నటివరకు సీఆర్‍పీఎఫ్‍ బెటాలియన్‍ ఉండగా ఇక్కడి నుంచి తరలివెళ్లింది. దీంతో ఆ భూములు అందుబాటులోకి వచ్చాయి. ఇప్పటికే కేయూ ప్రొఫెసర్లు, వివిధ విద్యార్థి సంఘాల నాయకులతో చర్చించి, ఒప్పించారు.  

వర్ధన్నపేట గ్రేటర్​ వరంగల్​కు 30 కి.మీ.

వర్ధన్నపేట గ్రేటర్‍ వరంగల్‍ నుంచి దాదాపు 30 కిలోమీటర్ల దూరంలో ఉంది. దీనికితోడు గ్రేటర్‍ లోని 66 డివిజన్ల చుట్టూ రింగ్‍ మాదిరిగా కాజీపేట, హనుమకొండ, వరంగల్‍ సిటీ ప్రాంతాలన్నీ వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోనే ఉన్నాయి. అయితే వర్ధన్నపేట సెంటర్​లో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం కూడా దొరికే పరిస్థితి లేదు. ఎమ్మెల్యే కేఆర్‍.నాగరాజు వర్ధన్నపేట దగ్గరలోని దమ్మన్నపేట, కక్కిరాలపల్లిలో భూముల పరిశీలన చేసినా ఆమోదయోగ్యంగా లేనట్లు తెలిసింది. హసన్‍పర్తి దగ్గరలో చింతగట్టు, దేవన్నపేట పరిసర ప్రాంతాలు, వరంగల్‍ నగరానికి దగ్గరలోని పైడిపల్లి ప్రభుత్వ భూములు అనుకూలంగా ఉంటాయని భావిస్తున్నారు.