- మ్యూచువల్ ఫండ్ల..ఫేవరేట్ షేర్లు ఇవే
- టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్లో ఇన్వెస్ట్ చేసిన 40 కంపెనీలు
- తర్వాత ప్లేస్లో ఇన్ఫోసిస్, మారుతి
- ఫార్మాస్యూటికల్ సెక్టార్లో సన్ ఫార్మాకి ఓటు : ఎమ్కే ఎంఎఫ్ ట్రాకర్
న్యూఢిల్లీ : మ్యూచువల్ ఫండ్స్ (ఎంఎఫ్) ఫేవరేట్ షేర్లలో టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్లో నిలిచాయి. దేశంలో 45 మ్యూచువల్ ఫండ్ కంపెనీలు ఉంటే ఇందులో 40 ఈ బ్లూచిప్ షేర్లలో ఇన్వెస్ట్ చేశాయి. తమ స్కీమ్లలో వీటికి ప్రాధాన్యం ఇచ్చాయి. ఇన్ఫోసిస్, మారుతి సుజుకీ తర్వాతి ప్లేస్లో ఉన్నాయి. 39 ఫండ్ హౌస్లు ఈ కంపెనీల్లో ఇన్వెస్ట్ చేశాయి. ఎమ్కే ఎంఎఫ్ ట్రాకర్ డేటా ప్రకారం, కన్జంప్షన్ సెక్టార్లో టైటాన్కు, ఎఫ్ఎంసీజీ సెక్టార్లో ఐటీసీ, హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్యూఎల్) కు అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలు (ఏఎంసీ) ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాయి.
మ్యూచువల్ ఫండ్స్కు ఫార్మాస్యూటికల్ సెక్టార్లో సన్ ఫార్మా మోస్ట్ ఫేవరేట్గా నిలిచింది. ఫైనాన్షియల్ సెక్టార్లో బజాజ్ ఫైనాన్స్కు ఓటేశాయి. గ్లోబల్ ఆర్థిక వ్యవస్థ మందగించినా, ఐటీ కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా చాలా మ్యూచువల్ ఫండ్స్ టాప్ టెక్ కంపెనీలకు ప్రాధాన్యం ఇచ్చాయి. మిడ్క్యాప్ ఐటీ కంపెనీలయినా పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐమైండ్ట్రీ, ఎంఫసిస్, కోఫోర్జ్ షేర్లలో ఎక్కువ ఫండ్ హౌస్లు ఇన్వెస్ట్ చేశాయి. ప్రభుత్వ బ్యాంక్ ఎస్బీఐ షేర్లను 30 ఏఎంసీలు హోల్డ్ చేస్తున్నాయి. ఫండ్ హౌస్లు హోల్డ్ చేస్తున్న టాప్ ప్రభుత్వం కంపెనీల్లో ఎన్టీపీసీ రెండో ప్లేస్లో కొనసాగుతోంది.
2024 లో టీసీఎస్ పుంజుకుంటుంది
గ్లోబల్గా ఐటీ ఇండస్ట్రీ ఇబ్బందుల్లో ఉన్నా టీసీఎస్పై మ్యూచువల్ ఫండ్స్కు మోజు తగ్గలేదు. వడ్డీ రేట్లు పెరగడంతో యూఎస్, యూరప్ దేశాల్లో కంపెనీలు ఐటీపై చేసే ఖర్చులు తగ్గించేశాయి. టీసీఎస్కు వచ్చే 68 శాతం రెవెన్యూ యూఎస్, ఈయూ నుంచే ఉంది. కంపెనీ సెప్టెంబర్ క్వార్టర్ ఫలితాలు చూస్తే డాలర్ రెవెన్యూ పడిపోవడం, ఉద్యోగులు తగ్గడం చూడొచ్చు. 2020 జూన్ క్వార్టర్ తర్వాత కంపెనీ రెవెన్యూ తగ్గడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్ క్వార్టర్ రిజల్ట్స్ ప్రకటించిన తర్వాత టీసీఎస్ షేర్లపై టార్గెట్ ధరను చాలా బ్రోకరేజ్ కంపెనీలు తగ్గించేశాయి.
కానీ, చాలా మంది ఎనలిస్టులు దేశ ఐటీ సెక్టార్పై నమ్మకంగా ఉన్నారు. ‘సెప్టెంబర్ క్వార్టర్లో టీసీఎస్ ఇబిటా మార్జిన్స్ రికవర్ అయ్యాయి. కంపెనీకి ఉన్న బిజినెస్, ఉద్యోగులు చూస్తే మీడియం టెర్మ్లో పుంజుకుంటుంది’ అని మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓ స్టేట్మెంట్లో పేర్కొంది. కంపెనీ ఏకంగా 11.2 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ను సెప్టెంబర్ క్వార్టర్లో గెలుచుకుందని తెలిపింది. వరుసగా మూడో క్వార్టర్లోనూ కంపెనీ గెలుచుకున్న డీల్స్ విలువ 10 బిలియన్ డాలర్లు దాటిందని, ఐటీ సెక్టార్లో టీసీఎస్ ఆధిపత్యానికి ఇది నిదర్శనమని పేర్కొంది. వచ్చే ఏడాది వడ్డీ రేట్లను ఫెడ్ తగ్గిస్తే టీసీఎస్కు మేలు జరగనుంది.
ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ వైపే
బ్యాంకింగ్ సెక్టార్లో మ్యూచువల్ ఫండ్స్ ఫేవరేట్ షేర్లుగా ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ ఉన్నాయి. మనీ కంట్రోల్ ఎనలిస్ట్ కాల్ ట్రాకర్ (నవంబర్) ప్రకారం, మిగిలిన నిఫ్టీ 50 షేర్లతో పోలిస్తే ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లకు ఎక్కువ ‘బయ్’ కాల్స్ వచ్చాయి. సెప్టెంబర్ క్వార్టర్లో ఈ ప్రైవేట్ బ్యాంక్ మంచి పనితీరు కనబరిచింది. కంపెనీ స్టాండ్ ఎలోన్ ప్రాఫిట్ ఇయర్ ఆన్ ఇయర్ ప్రకారం 35.5 శాతం పెరిగి రూ.10,261 కోట్లకు చేరుకుంది.
ఎనలిస్టుల అంచనాలను అధిగమించింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం 24 శాతం పెరిగి రూ.18,308 కోట్లుగా నమోదయ్యింది. మొండిబాకీలు కూడా తగ్గాయి. అసెట్ క్వాలిటీని మెరుగుపరుచుకుంటూనే ఐసీఐసీఐ బ్యాంక్ వివిధ బిజినెస్ సెగ్మెంట్లలో ఎదుగుతోందని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ పేర్కొంది. ఆన్లైన్, ఆఫ్లైన్లో నెట్వర్క్ను బలోపేతం చేస్తోందని, బ్యాంక్ ప్రొడక్టివిటీ పెరుగుతుందని వెల్లడించింది.
ఏఏ షేర్లలో ఎన్ని ఫండ్ హౌస్లు ఇన్వెస్ట్ చేశాయంటే..
కంపెనీ ఫండ్స్ సంఖ్య
టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ 40
ఇన్ఫోసిస్, మారుతి 39
ఆర్ఐఎల్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 38
ఎస్బీఐ, టైటాన్, యాక్సిస్ బ్యాంక్, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ 37
హెచ్సీఎల్ టెక్, ఐటీసీ, ఎల్ అండ్ టీ 36
సన్ ఫార్మా, టెక్ మహీంద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, హెచ్యూఎల్, బజాజ్ ఫైనాన్స్ 35
పెర్సిస్టెంట్ సిస్టమ్స్, ఎల్టీఐ మైండ్ట్రీ, కోటక్ మహీంద్రా బ్యాంక్,
ఇండస్ఇండ్ బ్యాంక్, కోఫోర్జ్, ఎయిర్టెల్, భారత్ ఎలక్ట్రానిక్స్ 34
నెస్లే, ఫెడరల్ బ్యాంక్, చోళమండళం ఇన్వెస్ట్మెంట్, టాటా మోటార్స్, టాటా స్టీల్ 33
హిందాల్కో, సిప్లా 32
ఇండియన్ హోటల్స్, ఎంఫసిస్, టీవీఎస్ మోటార్, బజాజ్ ఆటో, డాక్టర్ రెడ్డీస్ 31
పవర్ గ్రిడ్, ఎస్బీఐ లైఫ్, అబాట్, ఏషియన్ పెయింట్స్,
కోల్ ఇండియా, డిక్షన్ టెక్, ఐషర్ మోటార్స్, జూబిలియంట్ ఫుడ్వర్క్స్ 30