హైదరాబాద్, వెలుగు: త్వరలో మరో 40 వేల డబుల్బెడ్రూమ్ ఇండ్లను ఇస్తామని మంత్రి కేటీఆర్ తెలిపారు. ఇప్పటికే 30 వేల ఇండ్లు పంపిణీ చేశామన్నారు. రాష్ట్రంలో తొమ్మిదేండ్లలో అభివృద్ధి అంటే ఏమిటో చూపించామన్నారు. 2020లో వరదలు వచ్చినప్పడు ఇబ్బందులు ఎదురయ్యాయని చెప్పారు. కరోనా కారణంగా కొన్ని పనులు పూర్తి చేయలేక పోయామని, త్వరలో అన్ని పనులు పూర్తిచేస్తామన్నారు.
సోమవారం ఫతుల్లాగూడ, పీర్జాదిగూడతో పాటు మూసారంబాగ్ వద్ద మూసీపై బ్రిడ్జిల నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూసీ, ఈసీపై రూ.545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దుర్గం చెరువుపై నిర్మించిన దానికంటే అందమైన బ్రిడ్జిలను కడతామన్నారు. మూసీ సుందరీకరణ పనులు కొనసాగుతున్నాయని, అందులో భాగంగానే ఎస్టీపీల నిర్మాణం కొనసాగుతున్నదన్నారు.
అక్టోబర్ చివరి నాటికి పనులు పూర్త వుతాయన్నారు. 160 కిలోమీటర్ల ఓఆర్ఆర్ చుట్టూ తిరగకుండా మధ్యలో మూసీ నది మీదుగా వెళ్లే విధంగా బ్రిడ్జిలు నిర్మిస్తామని అన్నారు. రూ.5 వేల కోట్లతో రెండో విడుత ఎస్ఎన్డీపీ తొందరలోనే చేపడుతామన్నారు. జీవో 118లోని చిన్న చిన్న టెక్నికల్ సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాగే గోదావరి జలాలతో గండిపేట, హిమాయత్ సాగర్లను నింపుతామని మంత్రి చెప్పారు.