- ప్రధాని నరేంద్ర మోడీ సహా ప్రముఖులకు ఆహ్వానం
మహారాష్ట్ర సీఎం ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ సహా పలువురు ప్రముఖులను ఆహ్వానించింది శివసేన. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న 400 మంది రైతుల కుటుంబాలను కూడా ప్రమాణ స్వీకారోత్సవానికి పిలిచారు. తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రావాల్సిందిగా ప్రధాని మోడీకి ఫోన్ ద్వారా ఆహ్వానం పలికారు శివసేన చీఫ్ ఉద్ధవ్ థాక్రే. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీని ఉద్ధవ్ థాక్రే కుమారుడు ఆదిత్య థాక్రే స్వయంగా వెళ్లి ఆహ్వానించారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్లకు ఆహ్వానాలు పంపారు. తన సోదరుడు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన చీఫ్ రాజ్ థాక్రేను ఆహ్వానించారు ఉద్ధవ్ థాక్రే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రమాణస్వీకారానికి వస్తారని అశోక్ చవాన్ చెప్పారు.
భారీగా పోలీసు బందోబస్తు
ఇవాళ సాయంత్రం 6 గంటల 40 నిమిషాలకు ముంబైలోని శివాజీ పార్క్లో ఉద్ధవ్ థాక్రే సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతుతున్నారు. ఈ కార్యక్రమానికి 2 వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. ముంబై పోలీస్ కమిషనర్ సంజయ్ బర్వే శివాజ్ పార్కులో భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.