
- 249 డ్రోన్లు, మిసైళ్ల కూల్చివేత..మరో 226 జామ్
- దీటుగా బదులిస్తామన్న జెలెన్ స్కీ
కీవ్/మాస్కో: ఉక్రెయిన్ పై రష్యా అతిపెద్ద దాడికి పాల్పడింది. ఒక్కరోజే 477 డ్రోన్లు, 60 మిసైల్స్ తో ఆరు ప్రాంతాలపై విరుచుకుపడింది. మూడేండ్ల క్రితం మొదలైనప్పటి నుంచీ రష్యా ఇంత భారీ స్థాయిలో ఉక్రెయిన్ పై దాడి చేయడం ఇదే మొదటిసారి. శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకూ రష్యా డ్రోన్లు, బాలిస్టిక్, క్రూయిజ్ మిసైల్స్, గ్లైడ్ బాంబులతో దాడులకు పాల్పడగా, తాము దీటుగా తిప్పికొట్టామని ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్ స్కీ వెల్లడించారు. ఉక్రెయిన్లోని ఆరు ప్రాంతాలపైకి రష్యా ప్రయోగించిన వాటిలో 249 రష్యన్ ఇరానియన్ షహెద్ డ్రోన్లు, మిసైళ్లను తమ బలగాలు కూల్చివేశాయని, మరో 226 వెపన్స్ ను ఎలక్ట్రానిక్ విధానంలో జామ్ చేశామన్నారు. రష్యా డ్రోన్లను తమ ఎయిర్ ఫోర్స్ జెట్ విమానాలు కూల్చివేశాయని, ఈ ప్రయత్నంలో తాము మూడో ఎఫ్16 ఫైటర్ జెట్ను కోల్పోయామన్నారు. ఈ ఘటనలో తమ ఫైటర్ పైలట్ వీరోచితంగా పోరాడారని, రష్యా నుంచి వచ్చిన ఏడు ఏరియల్ టార్గెటర్లను ధ్వంసం చేశారన్నారు. చివరి టార్గెట్ ను పేల్చివేసే క్రమంలో ఫైటర్ జెట్ ధ్వంసమైందని, దీంతో జనావాసాలకు దూరంగా జెట్ ను తీసుకెళ్లే ప్రయత్నంలో పైలట్ ఎజెక్ట్ కాకుండా, వీరమరణం పొందాడన్నారు. ఒకవైపు ప్రపంచ దేశాలు శాంతి నెలకొల్పాలని పిలుపునిస్తుంటే రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం దాడులు కొనసాగిస్తున్నారని.. తాము కూడా దీటుగా బదులిస్తామన్నారు.
రష్యాలో 10 ఉక్రెయిన్ డ్రోన్ల కూల్చివేత..
రష్యా దాడులతో వివిధ ప్రాంతాల్లో ఆరుగురు గాయపడగా, ఇద్దరు మృతి చెందారని అధికారులు తెలిపారు. లవీవ్ రీజియన్లో మూడు చోట్ల భారీ భవనాలు, ఓ కాలేజీ బిల్డింగ్ ధ్వంసమయ్యాయని తెలిపారు. కాగా, బ్రియాన్స్క్ సిటీపైకి ఉక్రెయిన్ శనివారం రాత్రి ప్రయోగించిన 3 డ్రోన్లను, మరో ప్రాంతంపైకి పంపిన 7 డ్రోన్లను కూల్చేశామని రష్యా రక్షణ శాఖ ఆదివారం ప్రకటించింది. అలాగే ఉక్రెయిన్ లోని డోనెట్స్క్ రీజియన్లో ఓ గ్రామాన్ని తమ
బలగాలు స్వాధీనం చేసుకున్నాయని తెలిపింది.