హిందువుల ఆరాధ్య దైవం గణపతి. దేవతలందరికి అధిపతి గణపతి అని చెబుతుంటారు. శివపార్వతుల పెద్ద కొడుకు గణపతి. ఈ స్వామిని వినాయకుడు, గణేశుడు, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు అంటూ ఎన్నో రకాలుగా భక్తులు పిలుస్తుంటారు. మరి వినాయకుడి అవతారాలు ఎన్ని? వాటి విశేషాలతో పాటు శక్తివంతమైన అవతరాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
గణేష్ చతుర్థి గణేశుడి జన్మదినోత్సవం గణేష్ చతుర్ధి. వినాయకచవితి పండుగను జరుపుకుంటారు. ఈ పండుగను దేశ వ్యాప్తంగా 10 రోజుల పాటు నిర్వహిస్తారు. గొప్ప వైభవంగా ,ఉల్లాసంగా జరుపుకుంటారు. పురాణాల ప్రకారం, గణేశుడు రాక్షసుల నుండి భూమిని రక్షించడానికి అనేక అవతారాలలో ఉద్భవించాడని పురాణాలు చెబుతున్నాయి. అయితే ముద్గుల పురాణంలో వినాయకుడికి మొత్తం ఎనిమిది అవతరాలని చెప్పబడింది. అవి వక్రతుండ, ఏకదంతా, మహోదర, గజ వక్త, లంబోదర, వికట, విఘ్నరాజా, ధూమ్రవర్ణ అవతారాలు. వీటిలో వక్రతుండ, ఏకదంత, గజానన, లంబోదరుడు, ధూమవర్ణ అనే ఐదు మాత్రం శక్తివంతమైనవి...
వక్రతుండ అవతారం
పూర్వం మాత్సర్యాసురుడు అనే రాక్షసుడు శివుడి నుంచి నిర్భయ వరాన్ని ( భయం లేకుండా) పొందాడని పురాణాలు చెబుతున్నాయి. అప్పుడు ఆ రాక్షసుడు.. ఆయన కుమారులు ఇద్దరు సుందరప్రియ, విషయప్రియలు కలిసి ముల్లోకాలలోని దేవతలను, ప్రజలను శివుడి వరం కారణంగా నానారకాల ఇబ్బందులు పెడుతున్నాడట. అప్పుడు దేవతలందరే కలిసి కలసి దత్తాత్రేయుడు దగ్గరికి వెళ్లి ఉపాయం అడుగగా అయన గణపతిని ప్రార్ధించమని చెప్పాడని బ్రహ్మ పురాణంలో ఉందని ఆధ్యాత్మిక వేత్తలు అంటున్నారు. అప్పుడు దేవతలంతా కలసి గణపతిని ప్రార్ధించగా గణపతి వక్రతుండ అవతారం ఎత్తి సింహవాహనుడై వచ్చి ఆ రాక్షసుడిని వధించాడు. ఇదియే గణపతి మొదటి అవతారంగా చెబుతారు. వక్రతుండుడు అనగా విఘ్నములని ముక్కలుగా చేసేవాడని అర్ధం. అప్పటినుండి గణపతి వక్రతుండ గణపతిగా పూజలను అందుకుంటున్నాడు..
ఏకదంతుడు
పూర్వం మదాసురుడనే రాక్షసుడు ఉండేవాడట. మద్యం అంటే మదాసురుడికి చాలా ఇష్టమట. ఆ రాక్షసుడు తన మేనమామ అయిన శుక్రాచార్యుడి దగ్గర విద్యాభ్యాసం చేశాడని పండితులు చెబుతున్నారు. ఆ రాక్షసుడు వెయ్యి సంవత్సరాల పాటు ఘోర తపస్సు చేసి ఎన్నో శక్తులని సంపాదించాడు. మదాసురుడికి అతని గురువైన హ్రీం అనే శక్తి మంత్రాన్ని ఉపదేశించాడ. తపస్సు వలన లభించిన శక్తికి హ్రీం అనే మంత్ర శక్తి తోడవడంతో కొత్త ఆయుధాలు ధరించి .. మద్యం మత్తులో మూడు లోకాలపై దండెత్తాడు. మదాసురుడనే రాక్షసుడికి ఉన్న శక్తులు చూసి దేవతలంతా భయపడి పోయారు. అప్పుడు దేవతలు సనత్ కుమార మహర్షిని ప్రార్థించగా వారు వినాయకుడిని రక్షించమని కోరమన్నారట. ఇక ఆ సమయంలో దేవతలంతా కూడా గణేషుడిని ప్రార్ధించగా ఏకదంతుడి అవతారాన్ని ఎత్తి ఆ రాక్షసుడిని ఎదుర్కొంటాడు. మదాసురుడు అంటే గర్వానికి చిహ్నం.రాక్షసునితో యుద్ధం చేయడానికి ఏకదంతుడు మూషికానికి చేరుకున్నాడు. మదాసురుడు ధైర్యం కోల్పోయి లొంగిపోయాడు. సృష్టి యావత్తు కూడా ఒక్కటే అని చెప్పడం కోసమే ఈ ఏకదంత అవతారం.
గజాననుడు
గజానుడి అవతారంలో వినాయకుడు లోభాసురుడు అనే రాక్షసుడితో పోరాడాడు. శివుడి వరాలను పొంది ముల్లోకాలను ఎదిరించి చివరకు కైలాసాన్ని కూడా వశ పరుచుకోవాలని భావించాడు. ఆ రాక్షసుడు దౌర్జన్యంతో దేవతలను ముప్ప తిప్పలు పెట్టసాగాడు. అప్పడు దేవతలందరూ రైభ్య అనే పండితుడి సహాయం కోరారు. అప్పుడు విష్ణువు గణేషుని దూతగా లోభాసురుడి వద్దకు వెళ్లాడు. అయినా ఆ రాక్సుడు వినకపోవడంతో వినాయకుడు గజాననుడి అవతారం ఎత్తి ఆ రాక్షసుడిని సంహరిస్తాడు. గజాననుడు అనగా ఏనుగు ముఖం కలవాడని అర్ధం.
లంబోదరుడు
దేవతలు రాక్షసులు కలసి సాగరాన్ని మధించినప్పుడు అమృతం దక్కింది. అయితే అమృతం రాక్షసులకు దక్కకుండా చేసేందుకు శ్రీమహావిష్ణువు మోహిని రూపాన్ని ధరించగా ఆ రూపాన్ని చూసి శివుడికి మనసు చలించినదట, అప్పుడు నిజ రూపంలో వచ్చిన శ్రీమహావిష్ణువు చూసి శివుడి కోపం నుండి క్రోధసురుడు అనే రాక్షసుడూ ఉధ్భవించాడట. అలా జన్మించిన క్రోధసురుడు సూర్యుడి గురించి తపస్సు చేశాడు. సూర్యగ్రహ అనుగ్రహముతో మహాబలవంతుడయ్యాడు. నవ గ్రహాలకు అధిపతి సూర్యుడు. తాను ఏ గ్రహము వలన బాధించకుండ ఉండే వరము పొందాడు. దీంతో క్రోధసురుడు గ్రహాలను నానా రకాలుగా ఇబ్బంది పెట్టాడు. అప్పుడు నవ గ్రహాలు పార్వతి మాత వద్దకు వెళ్లి విన్నవించుకోగా... ఆ రాక్షసుడిని అంతమొందిచాలని చెప్పిందని పురాణాలు చెబుతున్నారు. అప్పుడు వినాయకుడు లంబోదరుడి రూపాన్ని ధరించి క్రోధాసురుడిని ఓడించాడని ఆధ్మాత్మిక వేత్తలు చెబుతున్నారు.
ధూమ్రవర్ణుడు
అహంకారేశ్వరుడు అనే రాక్షసుడిని హతమార్చేందుకు వినాయకుడు ధూమ్రవర్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి . పూర్వం ఒకానొక సమయంలో ముల్లోకాల గురించి చర్చించేందుకు బ్రహ్మ దేవతలందరిని ఆహ్వానించాడట. ఆ సమావేశాన్ని ఎవరు అధ్యక్షత వహించాలి అనే సంశయం కలిగిందట. అప్పుడు సూర్య భగవానుడి ప్రభావం ముల్లోకాలపై ఉంటుంది.. కావున.. సూర్యుడికి మూడు లోకాల విషయాలు అన్ని పూర్తిగా తెలుస్తాయని సూర్యుడిని అధ్యక్షత వహించాలని శివుడి ప్రతిపాదించగా దానికి బ్రహ్మ అంగీకారం తెలిపి అధ్యక్ష వహించే సామర్ద్యాన్ని సూర్యుడికి ఇవ్వాలని విష్ణువును కోరారట. అలా మూడు లోకాల గురించి చర్చించేటప్పుడు సింహాసనాన్ని అధిరోహించిన సూర్యునికి గర్వము, అహంకారం వచ్చిందని విష్ణు పురాణంలో ఉందని పండితులు చెబుతున్నారు. అప్పుడు సూర్యుడు అహంకారంతో తుమ్మాడని.. అలా తుమ్మినప్పుడు అతని తల నుంచి రాక్షసుడు జన్మించాడట. సూర్యుడు అహంకారం నుంచి జన్మించాడు కాబట్టి అతనికి దేవతలు అహంకారేశ్వరుడు అని పేరు పెట్టారట. అతను పెరిగి పెద్దవుతున్నా కొద్దీ అతనిలో అహంకార శక్తి కూడా పెరిగిందట. ఈ శక్తికి భయపడిన దేవతలు గణేషుని సహాయం కోరారట. అప్పుడు గణేషుడు ధూమ్రవర్ణ రూపాన్ని ధరించి అహంకారేశ్వరుడు నాశనం చేశాడని పురాణాలు చెబుతున్నాయి. అహంకారానికి సూచిక అహంకారేశ్వరుడు అనే రాక్షసుడు. మనిషి తాను అనే అహంకారాన్ని విడిచి భగవంతుడితో ఐక్యం కావాలనే సూచనే ఈ అహంకారాసురుని వృత్తాంతం అని చెబుతారు.