- 2027–28 నాటికి ఏడాదికి 85 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడవుతాయన్న ఓఎల్ఎక్స్ రిపోర్ట్
న్యూఢిల్లీ : దేశంలో సెకండ్ హ్యాండ్ కార్ల మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. ఓఎల్ఎక్స్ మొబిలిటీ రిపోర్ట్ ప్రకారం, ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్ సైజ్ 2022–23 లో ఉన్న రూ.2.1 లక్షల కోట్ల నుంచి 2027–28 నాటికి రూ.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. ఏడాదికి అమ్ముడవుతున్న కార్లు కూడా 85 లక్షలకు చేరుకుంటాయని అంచనా వేసింది. 2022–23 లో 46 లక్షల సెకండ్ హ్యాండ్ కార్లు అమ్ముడయ్యాయి.
సమస్యలు ఉన్నప్పటికీ కిందటి ఆర్థిక సంవత్సరంలో ప్రీఓన్డ్ కార్ల మార్కెట్ వృద్ధి చెందిందని ఓఎల్ఎక్స్ రిపోర్ట్ పేర్కొంది. అంతకు ముందు ఏడాదితో పోలిస్తే 14–16 శాతం గ్రోత్ సాధించిందని తెలిపింది. పర్సనల్ వెహికల్స్ తీసుకోవడంపై ప్రజలకు ఆసక్తి పెరిగిందని, ఆదాయాలు కూడా పెరగడంతో సెకండ్ హ్యాండ్ కార్ల అమ్మకాలు ఊపందుకున్నాయని వెల్లడించింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రీ ఓన్డ్ కార్ల మార్కెట్ 15 శాతం వృద్ధి చెందుతుందని, ఇక్కడి నుంచి ఏడాదికి కార్ల అమ్మకాలు 13 శాతం, వాల్యూ 18 శాతం వృద్ధి చెందుతుందని ఓఎల్ఎక్స్ రిపోర్ట్ పేర్కొంది. ఈ రిపోర్ట్ ప్రకారం, ప్రీమియం కార్లకు డిమాండ్ కనిపిస్తోంది.