
- డ్రాగన్ తీరుపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ ఆగ్రహం
వాషింగ్టన్ : చైనా లో పుట్టిన కరోనా కారణంగా ప్రపంచం మొత్తం సఫర్ అవటంపై అమెరికా నేషనల్ సెక్యూరిటీ అడ్వయిజర్ రాబర్డ్ ఓ బ్రయాన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క కరోనా మాత్రమే కాదు గత 20 ఏళ్లలో దాదాపు 5 ప్లేగు లాంటి మహమ్మారులు అక్కడి నుంచే పుట్టాయని అన్నారు. ఇంకా చైనా నుంచి వచ్చే మహమ్మారులను భరించలేమని స్పష్టం చేశారు. చైనాలో హెల్త్ సిస్టమ్ అస్తవ్యస్థంగా ఉందని అవసరమైతే వారికి సహాయం అందించేందుకు అమెరికా రెడీగా ఉందని చెప్పారు. చైనా కారణంగా ప్రపంచంలో జనమంతా ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారని విమర్శించారు. గత 20 ఏళ్లలో సార్స్, బర్డ్ ఫ్లూ, స్వైన్ ఫ్లూ ఇప్పుడు కరోనా అన్ని అక్కడి నుంచే వచ్చాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. “ 20 ఏళ్లలో చైనా నుంచి ఐదు ప్లేగు లాంటి మహమ్మారులు వచ్చాయి. సార్స్, బర్డ్ ప్లూ, స్వైన్ ఫ్లూ తో పాటు కరోనా ఇవన్నీ చైనా లో పుట్టినవే. ఇలా ప్రపంచం మీదకు వదులుతున్న భయంకరమైన పరిస్థితిని ఇంకా ఎంతోకాలం భరించలేం ” అని రాబర్ట్ ఓ బ్రయాన్ అన్నారు. ఐతే ఐదో మహమ్మారి ఏంటో రాబర్ట్ చెప్పలేదు. ఇక్కడితో ఇది ఆగిపోవాలని మరో మహమ్మారి రావద్దని కోరుకుంటున్నామని చెప్పారు. “పబ్లిక్ హెల్త్ క్రైసెస్ ను మేనేజ్ చేయటానికి చైనాకు సహాయం అవసరం ఉంది. మరోసారి ఇలాంటి వైరస్ లు పుట్టకుండా ఉండేందుకు అమెరికా వారికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది” అని అన్నారు. కరోనా ఎఫెక్ట్ కారణంగా వరల్డ్ వైడ్ గా 212 దేశాలు సఫర్ అవుతున్నాయి. వాటి ఆర్థిక వ్యవస్థలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నాయి. దీంతో చాలా దేశాలు కరోనాను వ్యాప్తిని అరికట్టటంలో చైనా విఫలమైందంటూ ఆగ్రహంగా ఉన్నాయి.