
మెట్రో నగరాలలో సామాన్యుల నీళ్ల తిప్పలు ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. ఉపాధి, చదువుల కోసం వలసలు విపరీతంగా పెరుగుతుండటంతో కాలనీలు క్రిక్కిరిసి పోవటం చూస్తూనే ఉంటాం. ముఖ్యంగా మిడిల్ క్లాస్, పేదలు నివసించే బస్తీల పరిస్థితి మరీ దారుణం. మున్సిపల్ వాటర్ సరఫరాల్లో ఇబ్బందులు, తాగు నీటిలో స్వచ్ఛత లోపించడం మొదలైన కారణాలతో సమస్యలు ఎదుర్కొంటుంటారు. దీంతో చాలా వరకు కొనుక్కుని నీళ్లు తాగాల్సిన పరిస్థితి.
తమిళనాడు లో పేదలు మధ్య తరగతి ప్రజలకు అలాంటి ఇబ్బంది లేకుండా మినరల్ వాటర్ మెషీన్లను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. తీవ్ర ఇబ్బంది ఉన్న ఏరియాలను సెలెక్ట్ చేసి వాటర్ ఏటీఎం (ATM) లను ఇన్ స్టాల్ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ మేరకు సీఎం ఎంకే స్టాలిన్ 50 వాటర్ వెండింగ్ మెషీన్లను జూన్ 18న ప్రారంభించారు.
మెట్రో వాటర్ డెవలప్ మెంట్ ఆధ్వర్యంలో ఈ మెషీన్లను ఏర్పాటు చేశారు. 24/7 ఉచిత డ్రింకింగ్ వాటర్ ను ఈ మెషీన్ల ద్వారా అందిస్తారు. పేదలు, మధ్య తరగతి ప్రజలకు మినరల్ వాటర్ అందించటమే లక్ష్యంగా ఈ ఏర్పాట్లను చేస్తోంది ప్రభుత్వం.
చెన్నైలోని వివిధ ప్రాంతాలలో గత నెల వాటర్ ఏటీఎంలను ఏర్పాటు చేసింది చెన్నై వాటర్ బోర్డు. నగరంలోని మొత్తం ఆరు జోన్లకు ఈ మెషీన్లను విస్తరించనున్నారు. బీచ్ లు, పార్కులు, టెంపుల్స్, బస్ డిపోలు, రైల్వే టెర్మినల్స్, మార్కెట్లు తదితర ప్రాంతాలలో ఈ ఏటీఎంలను ఏర్పాటు చేస్తున్నారు.
ఈ ఏటీఎం మెషీన్లు.. ప్యూరిఫై మెషీన్ తో పాటు నీళ్ల ట్యాంకుకు కనెక్టై ఉంటుంది. ఎప్పటికప్పుడు సీసీటీవీ పర్యవేక్షణలో ఉంటాయి. వినియోగదారులు లీటర్ లేదా 150 మిల్లీ లీటర్ల నీళ్లను పట్టుకోవచ్చు. ప్రతి ట్యాంక్ మెట్రో వాటర్ పైప్ లైన్ కు అనుసంధానం చేసి ఉంటుంది. ప్రతి రోజు నీటి సరఫరా ఉండేలా వీటిని కనెక్ట్ చేశారు.
ఇలాంటి వాటర్ వెండింగ్ మెషీన్లు జయలలిత ప్రభుత్వంలో 2016 లోనే ‘అమ్మ కుదినీర్’ పేరుతో తమిళనాడులో ఏర్పాటు చేశారు. కానీ సరైన మెయింటెనెన్స్ లేకపోవడంతో సక్సెస్ కాలేదు. ఇకనుంచైనా ప్రాపర్ మెయింటెనెన్స్ ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.