- సర్కారు ఖజానాకు దసరా కిక్కు
- ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,498 కోట్ల ఇన్ కమ్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర సర్కార్ కు దసరా పండుగ మస్తు కిక్ ఇచ్చింది. భారీ స్థాయిలో మద్యం సేల్స్ జరిగాయి. మూడ్రోజుల్లో ఏకంగా 80.47 లక్షల బీర్లు, 68.31 లక్షల ఐఎంఎల్ (ఇండియన్ మేడ్ లిక్కర్) బాటిళ్లు అమ్ముడయ్యాయి. దీంతో సర్కార్ ఖజానాకు మస్తు ఆదాయం సమకూరింది. రాష్ట్రంలో 2,216 వైన్స్లు, వెయ్యికి పైగా బార్లు ఉండగా.. మొత్తం 20 డిపోల నుంచి వీటికి మద్యం సరఫరా చేస్తారు. పండుగ కారణంగా ఈ నెల 13, 14, 16 తేదీల్లో ఏకంగా రూ.504 కోట్ల మద్యం డిపోల నుంచి వైన్స్, బార్లకు సరఫరా అయింది. రాష్ట్రంలో సాధారణంగా ఒక్క రోజు రూ.70 కోట్ల నుంచి రూ.80 కోట్ల వరకు మాత్రమే డిపోల నుంచి మద్యం లిఫ్ట్ చేస్తారు. దసరా కావడంతో ఇది రెండింతలైంది. 14న రూ.178 కోట్లు, 16న రూ.169 కోట్ల విలువైన మద్యం డిపోల నుంచి తరలించారు. కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు రూ.1,498 కోట్ల మద్యం అమ్మకాలు జరిగాయి. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.15,811 కోట్ల లిక్కర్ అమ్ముడైంది.
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో బీర్ల అమ్మకాలు జరిగాయి. రాష్ట్రంలో మూడేండ్ల కిందటి దాకా ఐఎంఎల్ సేల్స్ కంటే బీర్ల అమ్మకాలు డబుల్ ఉండేవి. అయితే క్రమంగా అది తగ్గుతూ వచ్చింది. ఐఎంఎల్ కంటే బీర్ల సేల్స్ తగ్గిపోయాయి. కరోనా టైమ్లో బీర్ల వాడకం చాలా వరకు పడిపోయింది. మరోవైపు ఎక్సైజ్ శాఖ కూడా బీర్ల ధరలను పెంచింది. అమ్మకాలు లేకపోవడంతో తయారీ సంస్థలు బీర్ల ఉత్పత్తిని తగ్గించాయి. అయితే ఇటీవల కరోనా తగ్గడం, వ్యాక్సిన్ అందుబాటులోకి రావడంతో పాటు ఒక బీర్పై రూ.10 తగ్గించడంతో అనూహ్యంగా బీర్ల అమ్మకాలు పెరిగాయి. ఈ నెలలో ఇప్పటికి2.06 కోట్ల బీర్లు అమ్ముడయ్యాయి. ఇందులో దసరా మూడ్రోజుల్లోనే దాదాపు సగం వరకు ఉండడం గమనార్హం.
రంగారెడ్డి టాప్..
మూడ్రోజుల్లో జరిగిన మద్యం సేల్స్ ను జిల్లాల వారీగా చూస్తే.. రంగారెడ్డిలో అత్యధికంగా అమ్మకాలు జరిగాయి. ఇక్కడ రూ.103 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి. 1.17 లక్షల కేసుల ఐఎంఎల్, 1.23 లక్షల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. ఆ తర్వాత నల్గొండలో రూ.59 కోట్లు, హైదరాబాద్ లో రూ.43 కోట్లు, మెదక్ లో రూ.41 కోట్లు, మహబూబ్నగర్ లో రూ.39 కోట్ల మద్యం సేల్స్ జరిగాయి.