- వీరిలో టీచర్లు, పోలీసులు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లే ఎక్కువ
- ఇప్పటికే కొందరు సెలవుల్లోకి వెళ్లి, ఎగ్జామ్ ఆలస్యంతో వెనక్కి
- అప్లై చేసుకున్న 3.80 లక్షల మందిలో 51 వేల మంది ఉద్యోగులే
- వీరిలో టీచర్లు, పోలీసులు, జూనియర్, సీనియర్ అసిస్టెంట్లే ఎక్కువ
- ఇప్పటికే కొందరు సెలవుల్లోకి వెళ్లి, ఎగ్జామ్ ఆలస్యంతో వెనక్కి
- అప్లై చేసుకున్న 3.80 లక్షల మందిలో 51 వేల మంది ఉద్యోగులే
హైదరాబాద్, వెలుగు : గ్రూప్–1కు నిరుద్యోగులతోపాటు ప్రభుత్వ ఉద్యోగులు కూడా భారీగానే పోటీ పడుతున్నారు. ప్రస్తుత జాబు కంటే పెద్ద కొలువు కొట్టాలనే టార్గెట్తో బరిలోకి దిగారు. గ్రూప్–1కు అప్లై చేసిన వారిలో జూనియర్ అసిస్టెంట్ నుంచి గ్రూప్–2 ఆఫీసర్ వరకు ఉన్నారు. అయితే ఎక్కువగా టీచర్లు, కానిస్టేబుల్స్, జూనియర్ అసిస్టెంట్లు, సీనియర్ అసిస్టెంట్లు ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తం 503 పోస్టులకు వచ్చిన 3,80,202 దరఖాస్తుల్లో ప్రభుత్వ ఉద్యోగుల అప్లికేషన్లు 51,553 ఉన్నాయి. గ్రూప్–1 పోస్టులకు ఈ సారి పోటీ తీవ్రంగా ఉంది. ఇంటర్వ్యూలు ఎత్తేయడం, ఏజ్ లిమిట్ పెంచడంతో గతంతో పోలిస్తే అప్లికేషన్లు భారీగా వచ్చాయి. ఒక్కో పోస్టుకు 756 మంది పోటీపడుతున్నారు. అక్టోబర్ 16న జరిగే గ్రూప్ –1 ప్రిలిమ్స్ నుంచి ఒక్కో పోస్టుకు 50 మందిని మెయిన్స్కు ఎంపిక చేస్తారు.
సెలవులు పెట్టి మరీ ప్రిపరేషన్
నోటిఫికేషన్ ఇచ్చిన టైమ్లో జులై లేదా ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుందని టీఎస్పీఎస్సీ ప్రకటించింది. దీంతో చాలామంది ఉద్యోగులు మే నుంచి, ఇంకొందరు జూన్ నుంచి సెలవు పెట్టారు. కొందరు మెయిన్స్ కూడా ప్రిపేర్ అయ్యేలా ఆరు నెలలపాటు లీవ్ పెట్టారు. కొంతమంది వివిధ జిల్లాల నుంచి హైదరాబాద్ కు వచ్చి, కోచింగ్ తీసుకుంటున్నారు. అయితే చాలామందికి సెలవులు ఇచ్చేందుకు ఉన్నతాధికారులు ససేమిరా అనడంతో వాళ్లంతా ఇంటి వద్దే ప్రిపరేషన్ ప్లాన్ చేసుకున్నారు. కొందరు ఉద్యోగులు ఆఫీసులకు పుస్తకాలు తెచ్చుకొని చదువుకుంటున్నారు. అయితే ముందుగా జులై, ఆగస్టులో ప్రిలిమ్స్ ఉంటుందనే భావనతో సెలవులు పెట్టిన ఉద్యోగులు, ఇప్పుడు అక్టోబర్లో ఎగ్జామ్ ఉంటుందని చెప్పడంతో లీవ్స్ను క్యాన్సిల్ చేసుకున్నారు. వీళ్లంతా సెప్టెంబర్లో లీవ్ తీసుకోవాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ సారి గ్రూప్–1కు అప్లై చేసిన వాళ్లలో గ్రాడ్యుయేట్స్ 2,53,490 మంది, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ 1,22,826 మంది, ఇంటిగ్రేటెడ్ కోర్సులు చేసినోళ్లు 1,781 మంది, ఎంఫిల్ చేసినవాళ్లు 424 మంది, పీహెచ్డీ చేసిన వాళ్లు 1,681 మంది ఉన్నారు. ప్రస్తుతం ప్రైవేటుగా వివిధ ఉద్యోగాలు చేస్తున్న వీరంతా లీవ్లు పెట్టి ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
- ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పనిచేసే ఓ సీనియర్ అసిస్టెంట్ గ్రూప్–1 కోసం రెండు నెలలపాటు సెలవు పెట్టి ప్రిపేర్ అవుతున్నారు. అయితే ఎగ్జామ్ డేట్ అక్టోబర్కు మారడంతో సెలవులు వెనక్కి తీసుకునే ఆలోచనలో ఉన్నారు. సెప్టెంబర్లో సెలవు పెట్టి ప్రిపేర్ కావాలని భావిస్తున్నారు.
- కరీంనగర్ జిల్లాలో అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసే ఓ ఉద్యోగి ప్రిపరేషన్ కోసం ఆరు నెలలపాటు సెలవు పెట్టాడు. ప్రస్తుతం ఆయన హైదరాబాద్లో కోచింగ్ తీసుకుంటున్నాడు.
- రంగారెడ్డి జిల్లాలో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసే ఓ కిందిస్థాయి ఉద్యోగి జాబ్కు లీవు పెట్టి కోచింగ్ కోసం సిటీలో ఉంటున్నాడు.