చైనాలో కరోనా మళ్లీ డేంజర్ బెల్స్ మోగిస్తోంది. గురువారం 55 మందికి కరోనా సోకినట్టు అధికారులు వెల్లడించారు. వీళ్లలో 54 మంది విదేశాల నుంచి వచ్చిన వారని, ఒకరికి మాత్రం స్థానికంగా వైరస్ సంక్రమించిందని తెలిపారు. మూడ్రోజుల తర్వాత జేజియాంగ్ ప్రావిన్స్లో ఈ కేసు నమోదైందన్నారు. దీంతో మళ్లోసారి కరోనా అడుగుపెట్టకుండా ఆ దేశం కట్టడి చర్యలు మొదలుపెట్టింది. ఫారినర్ల వీసాలను క్యాన్సిల్ చేసింది. ఫ్లైట్లను చాలా వరకు తగ్గించింది. మార్చి 28 వరకు వీటిని అమలు చేస్తున్నామంది. కొత్తగా వీసా కావాలనుకుంటే స్థానిక చైనా ఎంబసీల్లో అప్లై చేసుకోవాలని చెప్పింది. రెసిడెన్షియల్ పర్మిట్ ఉన్న వాళ్లకు కూడా అనుమతి లేదంది. గురువారం హుబెయ్ ప్రావిన్స్లో ఐదుగురు చనిపోయారని అక్కడి హెల్త్ కమిషన్ వెల్లడించింది. విదేశాల నుంచి వస్తున్న కేసుల్లోనూ చైనీయులే ఎక్కువ మంది ఉన్నారని.. వాళ్లు ఎక్కువగా ఇటలీ, యూరప్ దేశాల నుంచి వస్తున్నారని తెలిపింది.
3 నుంచి 10 శాతం మందికి
చైనాలో కరోనా తిరబెడుతోంది. కోలుకున్న వారిలో 3 నుంచి 10 శాతం మందికి మళ్లీ పాజిటివ్ వచ్చింది. ఈ మేరకు సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెల్లడించింది. అయితే మళ్లీ వ్యాధి వచ్చిన వాళ్ల నుంచి వేరే వాళ్లకు సోకుంతుందా లేదా తెలియదని పేర్కొంది. తోంగ్జి హాస్పిటల్లో 145 మందికి న్యూక్లియిక్ యాసిడ్ టెస్టుల్లో ఐదుగురికి మళ్లీ వైరస్ సోకిందని వెల్లడైంది. అయితే వాళ్లలో కరోనా లక్షణాలేవీ కనబడలేదని, వాళ్లలో క్లోజ్గా కాంటాక్టయిన వాళ్లకూ పాజిటివ్ రాలేదని చెప్పింది. మరోవైపు వుహాన్లోని క్వారంటైన్ సెంటర్లలోని రికవరైన 5 నుంచి 10 శాతం మందికి పాజిటివ్ వచ్చిందని తెలిసింది.
దక్షిణాఫ్రికాలో మిలిటరీ పెట్రోలింగ్
దక్షిణాఫ్రికాలో దేశమంతా మిలిటరీ పెట్రోలింగ్ చేస్తోంది. కర్ఫ్యూను కఠినంగా అమలు చేస్తోంది. 5.7 కోట్ల మంది ఇండ్లల్లోనే ఉండాలని అధికారులు ఆదేశించారు. దక్షిణ ఆఫ్రికాలో మూడు వారాల లాక్డౌన్ శుక్రవారం రాత్రి నుంచి అమల్లోకి రాబోతోంది. కరోనాతో అల్లాడుతున్న ఇరాన్లో అక్కడి ఆర్మీ 2 వేల పడకల తాత్కాలిక హాస్పిటల్ను అక్కడి తెహ్రాన్లోని ఎగ్జిబిషన్ సెంటర్లో ఏర్పాటు చేసింది. కేవలం 48 గంటల్లోనే కావాల్సిన సౌకర్యాలను సిద్ధం చేసింది. ఇరాన్లో 2,200 మంది చనిపోయారు. 30 వేల మందికి వైరస్ సోకింది. బ్రెజిల్లోని బొల్సొనారో చర్చిలను క్వారంటైన్ నుంచి మినహాయించారు. వెనెజులాలో తొలి కరోనా మరణం నమోదైంది. పెరూ దేశం ఏప్రిల్ 12 వరకు లాక్డౌన్ ప్రకటించింది. రెస్టారెంట్లు, రిసార్టులు, కేఫ్లను శనివారం నుంచి క్లోజ్ చేస్తున్నట్టు రష్యా వెల్లడించింది.కరోనా బాండ్లతో డబ్బులు అప్పు పొందే ఐడియాను జర్మనీ వ్యతిరేకించింది. ఫ్రాన్స్, ఇటలీల ఈ ప్రతిపాదనను ఆ దేశ చాన్సలర్ మెర్కెల్ తోసిపుచ్చారు.
నేపాల్లో చిక్కుకున్న 10 వేల మంది టూరిస్టులు
హాలీడే ప్రదేశాలు కాస్త పీడకలగా మారాయి. థాయ్లాండ్, నేపాల్ దేశాల్లో చిక్కుకున్న టూరిస్టులు దేశాల లాక్డౌన్లు, ఫ్లైట్లు క్యాన్సిల్ అవడంతో ఇబ్బంది పడుతున్నారు. ఒక్క నేపాల్లో 10 వేల మంది వరకు జనం చిక్కుకుపోయారు. వసంత కాలంలో నేపాల్కు ఎక్కువగా టూరిస్టులు వస్తుంటారు. అలా వెళ్లిన వాళ్లే ఇప్పుడు అక్కడ ఆగిపోయారు. మౌంట్ ఎవరెస్టు ప్రాంతంలోని లుక్లా ఎయిర్పోర్టులో కనీసం 200 మంది వరకు ట్రెక్కర్లు చిక్కుకుపోయారు. ఇటలీలో ఒక్కరోజే 919 మంది చనిపోయారు. అక్కడ ఒక్కరోజులో చనిపోయిన వారి సంఖ్యలో ఇదే రికార్డ్. ప్రపంచవ్యాప్తంగా 5,74,834 మందికి కరోనా సోకింది. మొత్తం 26,368 మంది బలయ్యారు. 199 దేశాలకు వైరస్ పాకింది.