ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ముగిసింది. దీంతో తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆగస్టు 7న కానిస్టేబుల్, 21న ఎస్సై ప్రిలిమినరీ ఎగ్జామ్స్ నిర్వహించనుంది. ఈ లెక్కన ప్రిలిమ్స్కు దాదాపుగా 60 రోజుల సమయం మాత్రమే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని అభ్యర్థులు ప్రిపరేషన్ను కొనసాగించాలి. కీలకమైన ప్రిలిమ్స్లో గట్టెక్కితేనే తుది పరీక్షలకు అర్హత సాధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఏ సబ్జెక్టులో ఏయే టాపిక్స్పై ఫోకస్ చేయాలి.. కామన్ అంశాలను ఎలా ప్రిపేర్ అవ్వాలి.. రీజనింగ్పై ఈజీగా ఎలా పట్టు సాధించాలి.. రివిజన్కు ఎంత సమయం కేటాయించాలో 60 రోజుల ప్రిపరేషన్ ప్లాన్ అభ్యర్థుల కోసం..
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్.. సబ్ ఇన్స్పెక్టర్(ఎస్ఐ), కానిస్టేబుల్ కేటగిరీల్లో 17,516 పోస్ట్లకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసింది. ప్రిలిమ్స్లో గట్టెక్కితే విజయ పథంలో సగం దూరం పయనించినట్లే! కాబట్టి అభ్యర్థులు ప్రిలిమ్స్ను ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వ్యూహాత్మక ప్రిపరేషన్ సాగించాలి.
ప్రిలిమ్స్ ప్యాటర్న్
కానిస్టేబుల్ ప్రిలిమినరీ పరీక్షను 200 ప్రశ్నలతో 200 మార్కులకు మూడు గంటల వ్యవధిలో నిర్వహిస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ ప్రిలిమినరీ రాత పరీక్షను రెండు విభాగాల్లో 200 మార్కులకు నిర్వహిస్తారు. అర్థమెటిక్ అండ్ టెస్ట్ ఆఫ్ రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ అంశాల నుంచి 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ స్టడీస్ నుంచి మరో 100 ప్రశ్నలు అడుగుతారు.
ఉమ్మడి అంశాలు కీలకం
రెండు పోస్టులకు సంబంధించి ప్రిలిమ్స్ పరీక్షలో ఉమ్మడి అంశాలు ఉన్నాయి. జనరల్ సైన్స్, కరెంట్ అఫైర్స్, హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీలు రెండు పోస్టుల్లోనూ ఉన్నాయి. ఎస్ఐ పోస్ట్లకు మాత్రం ప్రత్యేకంగా తెలంగాణ ఉద్యమం, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం, తెలంగాణ ఉద్యమ దశలను ప్రత్యేకంగా పేర్కొన్నారు. వాస్తవానికి కానిస్టేబుల్ ప్రిలిమ్స్ రాత పరీక్షలో సైతం తెలంగాణ ప్రాధాన్యం గల అంశాలని క్లుప్తంగా పేర్కొన్నారు. వీటిలోనూ తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఏర్పాటు, ఉద్యమ దశలకు సంబంధించిన ప్రశ్నలు అడిగే ఆస్కారం ఉంది. అర్థమెటిక్ కూడా రెండు పోస్ట్ల ప్రిలిమ్స్లో సిలబస్గా ఉంది.
కంబైన్డ్ ప్రిపరేషన్
ఇంటర్ అర్హతగా పేర్కొన్న కానిస్టేబుల్ పోస్ట్లకు బ్యాచిలర్ డిగ్రీ అభ్యర్థులు కూడా పోటీ పడే పరిస్థితి ఉంది. ఇలా రెండు పోస్ట్లకు హాజరయ్యే వారు రెండు పరీక్షల్లో ఉమ్మడిగా ఉన్న అంశాలను, ప్రత్యేకంగా ఉన్న టాపిక్స్ను గుర్తించి..దానికి అనుగుణంగా తమ సమయ ప్రణాళిక రూపొందించుకోవాలి.
కాన్సెప్ట్లపై అవగాహన ముఖ్యం
అభ్యర్థులు ప్రిపరేషన్ సమయంలో ఆయా అంశాలను అధ్యయనం చేసేటప్పుడు ప్రధానంగా వాటి కాన్సెప్ట్లపై అవగాహన పెంచుకోవాలి. గత ప్రశ్న పత్రాలను పరిగణనలోకి తీసుకుంటే.. ఇన్–డైరెక్ట్ ప్రశ్నలు కూడా కనిపించాయి. కాన్సెప్ట్లపై పట్టు సాధించడం ద్వారా.. ప్రశ్నను ఎలా అడిగినా సమాధానం ఇచ్చే సంసిద్ధత లభిస్తుంది.
ప్లాన్ ఫర్ రివిజన్
అభ్యర్థులు ప్రతి రోజు రివిజన్కు టైమ్ టేబుల్ రూపొందించుకోవాలి. ప్రతిరోజు ప్రిపరేషన్ ప్రారంభించే ముందు.. అంతకుముందు రోజు చదివిన అంశాల రివిజన్కు 20 నిమిషాల సమయం కేటాయించాలి. దీనివల్ల ఆయా అంశాల కొనసాగింపుగా ఉండే కొత్త టాపిక్స్ ప్రిపరేషన్ సులభంగా సాగుతుంది. ముఖ్యమైన పాయింట్లను, సూత్రాలను షార్ట్కట్ మెథడ్స్లో నోట్స్ రాసుకోవాలి.
అర్థమెటిక్పై పట్టుండాలి
అర్థమెటిక్ అండ్ రీజనింగ్.. ఎస్ఐ ప్రిలిమినరీ పరీక్షలో ఈ విభాగం నుంచే వంద ప్రశ్నలు అడుగుతారు. అర్థమెటిక్లోని ముఖ్యాంశాలుగా భావించే సగటు, కసాగు, గసాభా, సంఖ్యలు, వర్గ మూలాలు, ఘన మూలాలు, నిష్పత్తులు, భాగస్వామ్యం, వయసులు, శాతాలు, లాభ–నష్టాలు, చక్ర వడ్డీ, సరళ వడ్డీ, కాలం–దూరం, కాలం–పని వంటి వాటిపై పట్టు సాధించాలి. అదే విధంగా మ్యాథమెటిక్స్లోని ప్రాథమిక అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.
ఈజీగా రీజనింగ్
అభ్యర్థులు కాసింత విశ్లేషణాత్మక దృక్పథంతో వ్యవహరిస్తే మంచి మార్కులు సొంతం చేసుకునేందుకు అవకాశం ఉన్న విభాగం రీజనింగ్. ఇందులో నంబర్ సిరీస్, మిస్సింగ్ నెంబర్స్, కోడింగ్–డీకోడింగ్, సీటింగ్ అరేంజ్మెంట్, బ్లడ్ రిలేషన్స్ వంటి వాటిపై పూర్తి పట్టు సాధించాలి. వెన్ డయాగ్రమ్స్, అసెంప్షన్ అండ్ రీజన్, ఆర్గ్యుమెంట్, సిలాజిజమ్, డేటా సఫిషియన్సీ విభాగాల్లో పట్టుతో.. వెర్బల్ రీజనింగ్లో రాణించే అవకాశం ఉంది. ఆడ్మన్ ఔట్, డైస్ అండ్ క్యూబ్స్, వెన్ డయాగ్రమ్లపై పట్టుతో నాన్ వెర్బల్ రీజనింగ్లో వీలైనన్ని ఎక్కువ ప్రశ్నలకు సమాధానం ఇచ్చే నైపుణ్యం లభిస్తుంది.
వెయిటేజీ ఆధారంగా ప్రిపరేషన్
అభ్యర్థులు ప్రిలిమ్స్లో ఆయా అంశాలకు లభిస్తున్న వెయిటేజీకి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. అర్థమెటిక్, రీజనింగ్, భారత చరిత్ర, తెలంగాణ ఉద్యమం, తెలంగాణ చరిత్ర, కరెంట్ అఫైర్స్కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అదే విధంగా మెటీరియల్ ఎంపికలోనూ అప్రమత్తంగా వ్యవహరించాలి. నెగెటివ్ మార్కింగ్ విధానం ఉన్నందున చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రిపరేషన్ సమయంలో ప్రాక్టీస్కు ప్రాధాన్యం ఇవ్వాలి.
ప్రతి సబ్జెక్ట్ ప్రత్యేకంగా
అభ్యర్థులు పరీక్ష సిలబస్లో పేర్కొన్న ప్రతి సబ్జెక్ట్ గురించి ఫోకస్ చేయాలి. భారత చరిత్రకు సంబంధించి ముఖ్యమైన ఘట్టాలు, చరిత్ర గతిని మార్చిన సంఘటనలు, భారత స్వాతంత్య్ర ఉద్యమంలోని ప్రధాన ఘట్టాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలి. జాగ్రఫీలో భారత భౌగోళిక స్వరూపం, సహజ వనరులు, నదులు, సముద్ర తీర ప్రాంతాలు, అడవులు, పంటలు, సాగు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలి. ఎకానమీకి సంబంధించి కోర్ ఎకానమీ అంశాలతోపాటు సమకాలీన పరిణామాలు, దేశ ఆర్థిక రంగంలో అమలవుతున్న కొత్త విధానాలపై స్పష్టత ఏర్పరచుకోవాలి. పాలిటీకి సంబంధించి రాజ్యాంగం, రాజ్యాంగ రూపకర్తలు, రాజ్యాంగంలోని ముఖ్యమైన అధికరణలు వంటి అంశాలతోపాటు తాజా రాజ్యాంగ సవరణలు, వాటి ఉద్దేశం, ప్రభావం గురించి తెలుసుకోవాలి. కరెంట్ అఫైర్స్లో జాతీయం,అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకున్న తాజా పరిణామాలు(ఉదా: క్రీడలు–విజేతలు, సదస్సులు, సమావేశాలు–తీర్మానాలు తదితర) గురించి సమగ్ర పట్టు సాధించాలి. అదే విధంగా జాతీయ భద్రతకు సంబంధించి ఇటీవల కాలంలో తీసుకున్న నిర్ణయాలపై ప్రత్యేకంగా ఫోకస్ చేయాలి.
- వెలుగు, ఎడ్యుకేషన్ డెస్క్