
- 15 జిల్లాల్లో 70 శాతం పైనే.. నిర్మల్లో అత్యధికంగా 82 శాతం
హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కడుపు ‘కోత’లు పెరుగుతున్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో 60 సిజేరియన్లే ఉంటున్నాయి. ఈ ఏడాది రాష్ర్టంలో 2,99,658 జననాలు నమోదు కాగా, అందులో 1,79,231 కోత డెలివరీలే జరిగాయి. మొత్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో 1,71,234 ( మొత్తం ప్రసవాల్లో 57%) జననాలు నమోదైతే ఇందులో46% సిజేరియన్లు ఉన్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల్లో 1,28,424 ( మొత్తం ప్రసవాల్లో 43%) ప్రసవాలు జరిగితే, ఇందులో 78.14% సిజేరియన్లు ఉన్నాయి. వైద్యారోగ్యశాఖ తాజా రిపోర్టులో ఈ విషయాలు వెల్లడయ్యాయి.
రెండు జిల్లాల్లో 80 శాతం పైనే
నిర్మల్ జిల్లాలో జరిగిన ప్రసవాల్లో అత్యధికంగా 82% సిజేరియన్లే ఉన్నాయి. ఇక్కడ మొత్తం 7,337 ప్రసవాలు జరగ్గా, ఇందులో 6,040 సిజేరియన్లే. అత్యధిక సిజేరియన్లు జరుగుతున్న జిల్లాల్లో మహబూబాబాద్ (81%), సూర్యాపేట (77%), సిరిసిల్ల (77%) జిల్లాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. రాష్ర్టంలో 15 జిల్లాల్లో 70 శాతానికిపైగా కోత ప్రసవాలే నమోదయ్యాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్వో) లెక్క ప్రకారం సిజేరియన్లు 20 శాతానికి మించకూడదు. కనీసం ఒక్క జిల్లా కూడా ఈ మార్క్ను చేరుకోకపోవడం గమనార్హం. అసిఫాబాద్లో అత్యల్పంగా 22% సిజేరియన్లు నమోదవగా, గద్వాల (32%), నారాయణపేట్(37%) తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.
320 శిశు మరణాలు
20 వారాల ప్రెగ్నెన్సీ తర్వాత డెలివరీకి ముందు, లేదా డెలివరీ తర్వాత నమోదయ్యే శిశు మరణాలను వైద్య పరిభాషలో ‘స్టిల్ బర్త్స్’గా పిలుస్తారు. ఈ రకం మరణాలు 320 నమోదైనట్టు తాజా రిపోర్టులో వెల్లడైంది. పోషకాహార లోపం, తల్లి వీక్గా ఉండడం, బిడ్డ ఎదుగుదల లోపించడం, హైపర్ టెన్షన్, డయాబెటిస్ వంటి కారణాల వల్ల స్టిల్ బర్త్స్ జరిగే ప్రమాదం ఎక్కువ.