హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 61 మంది నామినేషన్

హుజూరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 61 మంది నామినేషన్
  • చివరి రోజు వేసిన బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులు
  • మొత్తం 92 సెట్ల నామినేషన్లు ఫైల్ 
  • మంత్రి హరీశ్ కు ఫీల్డ్ అసిస్టెంట్ల సెగ 
  • ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీల్లో రూ.8 లక్షలు స్వాధీనం 

హుజూరాబాద్ టౌన్, వెలుగు: హుజూరాబాద్ ఉప ఎన్నికకు నామినేషన్లు ముగిశాయి. చివరి రోజైన శుక్రవారం బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులతో పాటు పలువురు ఇండిపెండెంట్లు నామినేషన్లు వేశారు. మొత్తం 61 మంది అభ్యర్థులు 92 సెట్ల నామినేషన్లు ఫైల్ చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్లు 12 మంది నామినేషన్‌‌ వేశారు. బీజేపీ క్యాండిడేట్ ఈటల రాజేందర్ చివరి గంటలో వచ్చి నామినేషన్ వేయగా.. ఆయన వెంట కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, పార్టీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ ఉన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అంతకుముందు ఈటల భార్య జమున కూడా నామినేషన్ వేశారు. మంత్రి హరీశ్ రావు, కౌశిక్ రెడ్డిలతో కలిసి టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ నామినేషన్ వేశారు. మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ లతో కలిసి కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకట్ నామినేషన్ వేశారు. కాగా, హుజూరాబాద్​ మండలం సింగాపూర్ శివారులో ఫ్లయింగ్ స్క్వాడ్ నిర్వహించిన తనిఖీల్లో రూ.8.10 లక్షలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నామినేషన్ సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన పలువురిపై కేసులు నమోదు చేశామని టౌన్ సీఐ శ్రీనివాస్ తెలిపారు.
ఫీల్డ్ అసిస్టెంట్ల ఆందోళన..
నామినేషన్లు వేయడానికి శుక్రవారం కూడా భారీ సంఖ్యలో ఫీల్డ్ అసిస్టెంట్లు వచ్చారు. ఇన్ని రోజులు రూల్స్ అంటూ తమను అడ్డుకున్న పోలీసులు.. ఇతరుల విషయంలో మాత్రం వాటిని పాటించడం లేదని మండిపడ్డారు. పోలీసుల తీరును నిరసిస్తూ ఆందోళన చేశారు. అదే టైమ్ లో మంత్రి హరీశ్ రావు అక్కడికి రావడంతో.. ఆయనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో కారులోనే మీడియా పాయింట్ వరకు వెళ్లిన హరీశ్ రావు.. అక్కడ మీడియాతో మాట్లాడిన తర్వాత మరో దారి గుండా వెళ్లిపోయారు.