ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

ఆరోగ్యశ్రీలో అదనంగా 65 కొత్త చికిత్స విధానాలు అమలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఉన్న రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకంలో చికిత్సలకు మరో 65 కొత్త చికిత్సా విధానాలు అమలు చేసేందుకు సర్కార్ సిద్ధమైంది. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం కింద యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుముక వంటి ఖరీదైన వ్యాధులకు చికిత్స, ప్రస్తుతం అమల్లో ఉన్న ఆరోగ్యశ్రీ పథకంలోని చికిత్సల ప్యాకేజీ ధరలు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటికి సంబంధించి రూ.497.29 కోట్లు అవసరం కాగా.. 2024, జూన్ 8వ తేదీ శనివారం ఈ నిధులను విడుదల చేస్తూ డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి  విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు.

రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం కింద కొత్త చికిత్సా విధానాలపై భట్టి విక్రమార్క సచివాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 2007లో పేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు ఆరోగ్యశ్రీ పధకం ప్రెవేశపెట్టిన సంగతి తెలిసిందే.

రాష్ట్రంలో ఈ పథకం కింద 2.84 కోట్ల లబ్ధిదారులు ఉన్నారు. ఈ పథకం ద్వారా వీరికి రూ.10  లక్షల వరకు ఆర్ధిక సహాయం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం1402 ఆసుపత్రుల అమలులో ఉంది. ప్రస్తుతం ఈ పథకంలో 1672 చికిత్సా విధానాలు అందుబాటులో వున్నాయి. ఇందులో 1375 విధానాలకు ప్యాకేజీ ధరలు పెంచాలని వైద్య నిపుణుల సూచనల మేరకు డిప్యూటీ సీఎం నిర్ణయం తీసుకున్నారు.

ఇప్పటివరకు ఆరోగ్యశ్రీలో అమలులో లేని యాంజియోగ్రామ్, పార్కిన్ సన్, వెన్నుపూస కు సంబంధించిన 65 అధునాతన చికిత్స విధానాలను ఇకనుంచి ఆరోగ్యశ్రీలో అమలు చేయాలని డిప్యూటీ సీఎం నిర్ణయించారు. వీటికి తోడు ప్రస్తుతం ఆయుష్మాన్ భారత్ లో ఉన్న 98 చికిత్సా విధానాలు రాజీవ్ ఆరోగ్యశ్రీలో చేర్చడం వల్ల దాదాపు రూ.189.83 కోట్ల ఖర్చు ప్రభుత్వంపై పడనుంది.  అంతే కాక, 65 కొత్త చికిత్సా విధానాలు అంగీకరించడం ద్వారా  ప్రభుత్వం రూ.158.20 కోట్లు ఖర్చు చేయనుంది.