ఒక దొంగ కరోనా పాజిటివ్ రావడంతో పది మంది క్వారంటైన్ లోకి వెళ్లాల్సి వచ్చింది. అందులో ఏడుగురు పోలీసులు, ఒక జడ్జితో పాటు ఇద్దరు సామాన్యులు ఉన్నారు. ఇంకా ఆ దొంగ ఎక్కడెక్కడ తిరిగాడనే సమాచారం రాబట్టాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన పంజాబ్ లోని లుధియానాలో జరిగింది.
జడ్జి ఎదుట గట్టిగా దగ్గి… టెస్ట్ టైమ్ లో ఒక దొంగ పరార్
లుధియానా నగరంలోని ఓ ప్రాంతంలో ఇద్దరు దొంగలు చోరీకి ప్రయత్నించారు. అయితే వారిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వారిని పోలీసులు జడ్జి మోనికా సింగ్ ఎదుట ప్రవేశపెట్టినప్పుడు ఆ ఇద్దరూ గట్టిగా దగ్గారు. దీంతో వారికి వైద్య పరీక్షలు చేయించాలని ఆదేశించారు న్యాయమూర్తి. ఆ ఇద్దరిని కరోనా టెస్టుల కోసం ఆస్పత్రికి తరలించారు పోలీసులు. అక్కడ టెస్టులు చేసే సమయంలో ఒక దొంగ పరారయ్యాడు. రెండో దొంగకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అతడిని ఐసోలేషన్ వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ దొంగలను పట్టించిన ఇద్దరు వ్యక్తులతో పాటు వారిని అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేసిన ఏడుగురు పోలీసు సిబ్బంది, జడ్జిని క్వారంటైన్ చేసినట్లు తెలిపారు పోలీసు ఉన్నతాధికారులు. పరారైన దొంగను పట్టుకునేందుకు గాలింపు సాగిస్తున్నట్లు చెప్పారు.