ఫ్రాన్స్‌‌ లో వారానికి 7 లక్షల టెస్టులు

ఫ్రాన్స్‌‌ లో వారానికి 7 లక్షల టెస్టులు

కాంటాక్ట్స్ అందరికీ చేయనున్న ఫ్రాన్స్
ఇంగ్లాండ్ కేర్ హోంలలో పెరుగుతున్న చావులు
పాక్ పీఎం ఇమ్రాన్ అనుచరుడికి కరోనా

పారిస్: ఫ్రాన్స్ లో కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టెస్టులను వేగవంతం చేయనున్నట్లు ప్రధాని ఎడ్వర్డ్ ఫిలిప్ వెల్లడించారు. లక్షణాలున్నా, లేకపోయినా కాంటాక్ట్స్ అందరికీ టెస్టులు చేస్తామని ఆయన చెప్పారు. దీంతో దాదాపు వారానికి 7 లక్షల టెస్టులు చేస్తామ‌‌ని తెలిపారు. మే 12 నుంచి లాక్ డౌన్ ను సడలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నర్సరీలు, ప్రైమరీ స్కూళ్లు ఆ రోజు నుంచి ప్రారంభమవుతాయని చెప్పారు. నర్సరీల్లో ఒక్కో గ్రూపులో 10 మంది, స్కూళ్లలో 15 మంది స్టూడెంట్లు మాత్రమే ఉండేలా చూస్తామన్నారు. హైస్కూళ్లను మే 18 నుంచి కొన్ని పరిమితులతో ఓపెన్ చేస్తామని వెల్లడించారు.

15 రోజుల్లోనే 4 వేల మరణాలు

ఇంగ్లాండ్, వేల్స్ లోని కేర్ హోంలలో ఏప్రిల్ 10 నుంచి 24 మధ్యలోనే.. 4,300కు పైగా మంది కరోనా వల్ల చనిపోయారని అధికారులు వెల్లడించారు. దేశంలో మొత్తం 25 వేల మంది చనిపోగా, హాస్పిటళ్ల వెలుపల ఎక్కువగా కేర్ హోంలలోనే మరణాలు సంభవిస్తున్నాయని తెలిపారు.
ఈజిప్టులో మరో 3 నెలలు ఎమర్జెన్సీ

ఈజిప్టులో ఎమర్జెన్సీని ప్రభుత్వం మరో మూడు నెలలు పొడిగించింది. ఆరోగ్యం, భద్రతే తమకు ముఖ్యమని ప్రెసిడెంట్ అబ్దెల్ ఫతాహ్ అల్ సీసీ చెప్పారు. ఎమర్జెన్సీ రూల్స్ ప్రకారం, పోలీసులు వ్యక్తులను అదుపులోకి తీసుకునేందుకు లేదా అరెస్ట్ చేసేందుకు అధికారాలు కల్పించారు.

చైనా, ఆస్ట్రేలియా మధ్య టెన్షన్

కరోనా విపత్తుపై వైఖరుల కారణంగా ఆస్ట్రేలియా, చైనా మధ్య దౌత్యపరమైన విభేదాలు పెరుగుతున్నాయి. ఈ విపత్తు తమ ఎకానమీకి తీవ్ర ముప్పుగా మారిందని ఆస్ట్రేలియా భావిస్తోంది. కరోనా వైరస్ వ్యాప్తి విషయంలో చైనాపై అంతర్జాతీయ విచారణ జరగాలని డిమాండ్ చేస్తోంది. దీనిపై చైనీస్ అంబాసిడర్ ను ఆస్ట్రేలియా ట్రేడ్ మినిస్టర్ సైమన్ బర్మింగ్ హామ్ వివరణ కోరారు.

పాక్ సింధ్ ప్రావిన్స్ గవర్నర్ కు కరోనా

పాకిస్తాన్ లోని దక్షిణ సింధు ప్రావిన్స్ గవర్నర్, ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ముఖ్య అనుచరుల్లో ఒకరైన ఇమ్రాన్ ఇస్మాయిల్ కు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది. దీనిపై ఇస్మాయిల్ ట్విటర్ లో సోమవారం స్పందించారు. ‘‘కరోనాను ఎదుర్కొనేందుకు మనం చేసుకున్న ఏర్పాట్లు ఏవీ సరిపోవని నేను భావిస్తున్నా. ఈ మహమ్మారిపై పోరాడేందుకు అల్లా మనకు శక్తిని ఇవ్వాలని వేడుకుంటున్నా’’ అని ట్వీట్ చేశారు.

1594 new corona cases and 51 deaths reported in last 24 hours in India