జనగామ, వెలుగు : జనగామ మున్సిపాలిటీ మీటింగ్ వాగ్వాదాల మధ్య గందరగోళంగా ముగిసింది. పోడియంపై చైర్ పర్సన్ కడకంచి బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డి కూర్చున్నారు. 30 మంది కౌన్సిలర్లు ఉండగా, 8 మంది కాంగ్రెస్, ముగ్గురు బీఆర్ఎస్ కౌన్సిలర్లు ప్రారంభం సమయానికి వచ్చారు. కోరం సమకూరడంతో 54 అంశాలతో కూడిన ఎజెండాను చైర్ పర్సన్ చర్చకు పెట్టారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు మినహా మిగిలిన కాంగ్రెస్ కౌన్సిలర్లు ఓకే చేయడంతో ఎజెండా పాస్ అయినట్టుగా ప్రకటించారు. కాగా, ఎజెండా అంశాలపై సమాచారం అందుకున్న బీఆర్ఎస్ కౌన్సిలర్లు అందరూ మున్సిపాలిటీకి చేరుకొని, అంశాలను చదివి విన్పించాలని డిమాండ్ చేశారు. అయితే కోరం ఉండడం వల్ల ఎజెండా అంశం ముగిసిపోయిందని కమిషనర్ మహేశ్వర్ రెడ్డి ప్రకటించారు.
దీంతో కోరం లేకున్నా మీటింగ్ ప్రారంభించడమే కాకుండా ఎజెండా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నిస్తూ పోడియంను కౌన్సిలర్లు చుట్టుముట్టారు. చైర్ పర్సన్ బాలమణి, కమిషనర్ మహేశ్వర్ రెడ్డితో వాగ్వాదానికి దిగారు. చైర్ పర్సన్ బాలమణి 'ఎజెండా అమోదం పొందింది. సమావేశం ముగిసింది' అని ప్రకటించి హాల్ నుంచి వెళ్లిపోయారు. అనంతరం కమిషనర్ చాంబర్కు చేరుకున్న కౌన్సిలర్లు ఆయనతో వాగ్వాదానికి దిగారు. కోరం లేకున్నా ఎజెండాను ఆమోదింప చేసుకున్నారని, మీటింగ్ విజివల్స్ చూపించాలని డిమాండ్ చేశారు. కమిషనర్ బయటకు వచ్చి కారులో వెళ్లిపోవడానికి ప్రయత్నించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కారుకు అడ్డంగా కూర్చుని నినాదాలు చేశారు. ఈ అంశాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని కమిషనర్తెలిపారు.
