ఛత్తీస్గఢ్లో భారీ ఎన్కౌంటర్ జరిగింది. నారాయణపూర్-కంకేర్ సరిహద్దు ప్రాంతంలోని అబుజ్మద్లో భద్రతా బలగాలతో మంగళవారం జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు మహిళలు సహా ఏడుగురు మావోయిస్టులు మరణించినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఎన్కౌంటర్ స్థలం నుండి భారీ మొత్తంలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, పేలుడు పదార్థాలతో సహా ఒక ఎకె 47 కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (బస్తర్ రేంజ్) పి సుందర్రాజ్ మాట్లాడుతూ.. “జిల్లా రిజర్వ్ గార్డ్ (డిఆర్జి), స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టిఎఫ్) సంయుక్త బృందం సోమవారం(ఏప్రిల్ 29) రాత్రి నుంచి నక్సల్ వ్యతిరేకగా సెర్చ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ రోజు ఉదయం 6 గంటలకు టేక్మెటా, కాకూర్ గ్రామం మధ్య ఉన్న అటవీ ప్రాంతంలో బద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు" అని తెలిపారు.
ఘటనా స్థలం నుంచి ఇద్దరు మహిళా మావోయిస్టులతో సహా ఏడుగురు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు ఐజీ తెలిపారు. చనిపోయిన మావోయిస్టుల వివరాలను ఇంకా గుర్తించలేదని.. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని ఆయన తెలిపారు.