
అమెరికాలోని టెన్నెస్సీ నదీ తీరం వెంబడి ఉన్న బోటు డాక్యార్డ్లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇప్పటి వరకు 8 మంది ప్రాణాలు కోల్పోగా… పలువురు గల్లంతయ్యారు. అమెరికా కాలమానం ప్రకారం నిన్న(సోమవారం) వేకువ జామున ఈ ప్రమాదం జరిగింది. మొత్తంగా 35 పడవలు మంటల్లో చిక్కుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని, స్కాట్స్బోరో అగ్నిమాపక అధికారి జెనె నెక్లాస్ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు.
ప్రమాద సమయంలో చాలామంది పడవల్లో గాఢ నిద్రలో ఉన్నట్టు తెలుస్తోంది. మొదట అర్ధరాత్రి దాటాక జాక్సన్ కంట్రీ పార్క్కు మంటలు అంటుకోగా ఆ వెంటనే డాక్యార్డ్ వైపునకు వేగంగా విస్తరించాయి. మంటలు చుట్టుముట్టడంతో తమను తాము రక్షించుకునేందుకు చాలామంది టెన్నెస్సీ నదిలో దూకారు. వారిని అధికారులు రక్షించారు. చాలా పడవలు చెక్కలతో నిర్మించడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.