‘అబ్బా అప్పుడే తెల్లారిందా..! ఇంకో గంట సేపు పడుకుందాం..!’.. అలారంను రీసెట్ చేసి చెద్దరు కప్పేసిన అబ్బాయి!
‘ఇప్పటికే బాగా చేసేసినం. ఇవ్వాళ్టికి చాల్లే ఈ ఎక్సర్సైజ్’ ఓ గంట సేపు చేయగానే ఓ అమ్మాయి నిట్టూర్పు!
ఏదైతేనేం పిల్లలు బద్ధకస్థులైపోతున్నారు. ప్రపంచంలో దాదాపు 80 శాతం మంది పిల్లలు లేజీగానే ఉంటున్నారు. అందులోనూ ఆడపిల్లలే ఎక్కువ బద్ధకస్తులున్నారు. దేశాల వారీగా చూస్తే లేజీ పిల్లల్లో దక్షిణ కొరియా టాప్లో ఉంది! అక్కడ 94 శాతం మంది పిల్లలు బద్ధకస్తులేనట. దాంతో పాటు ఫిలిప్పీన్స్, కంబోడియా, సూడాన్ వంటి దేశాల్లోని 90 శాతం మందికిపైగా పిల్లలు లేజీగా ఉంటున్నారట. కనీసం గంట పాటైనా ఫిజికల్ యాక్టివిటీ లేని 11 నుంచి 17 ఏళ్ల వయసున్న లేజీ పిల్లలు ఏ దేశంలో ఎక్కువగా ఉన్నారో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్వో) ఓ స్టడీ చేసి రిపోర్టును విడుదల చేసింది. డబ్ల్యూహెచ్వో డాక్టర్ రెజీనా గుథోల్డ్ ఈ రిపోర్టును తయారు చేశారు. ఈ జాబితాలో మనం మంచి పొజిషన్లోనే ఉన్నాం. అయితే, శారీరక శ్రమ లేకపోవడం వల్ల పిల్లలు లావు అయ్యే ముప్పు పెరుగుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంగ్లాదేశ్ పిల్లలు యాక్టివ్
యాక్టివ్ పిల్లలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో ఇండియా మంచి స్థానంలోనే ఉంది. దాదాపు 26 శాతం మంది పిల్లలు శరీరానికి అవసరమైనంత మేర ఎక్సర్సైజులు చేస్తున్నారు. ఇనాక్టివ్గా ఉంటున్న పిల్లలు 73.9 శాతం. యాక్టివ్గా ఉంటున్న పిల్లల జాబితాలో మన దేశం ఏడో స్థానంలో ఉంది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ టాప్లో ఉంది. 34 శాతం మంది యాక్టివ్ పిల్లలతో ప్రపంచంలో నంబర్ వన్ దేశంగా క్రెడిట్ కొట్టేసింది. 66.1 శాతం మంది బంగ్లాదేశ్ పిల్లలు గంట సేపు కూడా ఎక్సర్సైజు చేయట్లేదక్కడ. అయితే, ఎంత టాప్లో నిలిచినా 16 లక్షల మంది పిల్లల్లో ఎక్సర్సైజులు చేస్తున్న వారి సంఖ్య ఇంకా తక్కువగానే ఉందని డబ్ల్యూహెచ్వో పేర్కొంది. ఇక, రెండో స్థానంలో స్లొవేకియా (28.5%), మూడో స్థానంలో ఐర్లాండ్ (28.2%), నాలుగో స్థానంలో అమెరికా (28%), ఐదో స్థానంలో బల్గేరియా (26.7%) ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా కనీసం గంట సేపు ఎక్సర్సైజు చేస్తూ యాక్టివ్గా ఉంటున్న పిల్లల సంఖ్య కేవలం 20 శాతంగా ఉందని డబ్ల్యూహెచ్వో రిపోర్టు పేర్కొంది. 146 దేశాల్లో ఆడపిల్లలే ఎక్కువ లేజీగా ఉంటున్నారని తేల్చింది. ఈ జాబితాలో టోంగా, సామోవా, ఆఫ్గనిస్థాన్, జాంబియాలే ఎక్కువ ట్రెండింగ్లో ఉన్నాయి. ఇక, బద్ధకపు అబ్బాయిలు ఎక్కువున్న దేశాల జాబితాలో ఇండియా, అమెరికా, బంగ్లాదేశ్ టాప్ 3లో ఉన్నాయి.
ఎలక్ట్రానిక్ యుగంలో పట్టించుకోవట్లే
పిల్లలు లేజీగా ఉండడానికి కారణం ఇప్పుడున్న ఎలక్ట్రానిక్ పరికరాలే కారణమని అంటున్నారు. ఎప్పుడూ ఫోన్లకు లేదంటే కంప్యూటర్లకు పిల్లలకు అతుక్కుపోతుండడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడుతోందని చెబుతున్నారు. ‘‘మారుతున్న ప్రపంచంతో పాటే జనమూ మారుతున్నారు. ఎలక్ట్రానిక్ రెవల్యూషన్ జనాలను పూర్తిగా మార్చేసింది. పిల్లల జీవితాలనూ కట్టిపడేసింది. నేర్చుకోవాలన్నా, పని చేయాలన్నా, ఆడుకోవాలన్నా, ప్రయాణానికైనా, దేనికైనా వాటిపైనే ఆధారపడాల్సి వస్తోంది. దీంతో అందరూ ఇంటికే పరిమితమైపోతున్నారు. కుర్చీలు, మంచాలకు అతుక్కుపోతున్నారు. ఫలితంగా శరీరానికి సరైన శ్రమ ఉండట్లేదు” అని కెనడాలోని చిల్డ్రెన్స్ హాస్పిటల్ ఆఫ్ ఈస్టర్న్ ఒంటారియో రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ డాక్టర్ మార్క్ ట్రెంబ్లే అన్నారు. ఎక్సర్సైజులు చేయకపోవడం వల్ల పిల్లలు లావైపోతారని, దాంతో అనేక ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని బ్రిటన్ రాయల్ కాలేజ్ ఆఫ్ పీడియాట్రిక్స్ అండ్ చైల్డ్ హెల్త్ ప్రొఫెసర్ వినర్ అన్నారు.