
- 34 వేల చెట్లను రీప్లాంటేషన్చేసేందుకు అటవీశాఖ ఏర్పాట్లు
- రూ.30 కోట్లకు పైగా అవసరమవుతాయని అంచనా
- అనుమతులు రాగానే ప్రారంభం కానున్న పనులు
జగిత్యాల, వెలుగు: జగిత్యాల జిల్లా ధర్మపురి, బీర్పూర్ మండలాల్లో 15 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు గత ప్రభుత్వం హయాంలో రోళ్లవాగు ప్రాజెక్టు ప్రారంభమైంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ పనులు చివరి దశకు చేరుకోగా.. సుమారు 816 ఎకరాల ఫారెస్ట్ ల్యాండ్ ముంపునకు గురవుతోంది. దీనిలో వేలాది చెట్లు నీటమునగనున్నాయి. సుమారు 34వేల చెట్లను రీ ప్లాంటేషన్ చేసేందుకు అటవీశాఖ ఏర్పాట్లు చేస్తోంది. చెట్ల రీప్లాంటేషన్ కోసం అనుమతులు రాగానే ఈ ప్రక్రియ మొదలుకానుంది. ఇటీవల సర్వే చేసిన అధికారులు రెండు వారాల కింద నివేదిక రెడీ చేసి ఢిల్లీలోని ఉన్నతాధికారులు
పంపించారు.
మునుగుతున్న 816 ఎకరాల ఫారెస్ట్ భూములు
రోళ్లవాగు ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే దాదాపుగా 816 ఎకరాల అటవీ భూములు మునుగుతాయని అధికారులు అంచనా వేశారు. అయితే మునిగే అటవీ ప్రాంతంలో అరుదైన జాతికి చెందిన భారీ వృక్షాలు ఉండడంతో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ పర్మిషన్ ఇవ్వడం లేదని తెలుస్తోంది. దీంతో ప్రాజెక్టు నిర్మాణంలో జాప్యం నెలకొంది. దీనికి పరిష్కారంగా ముంపుకు గురయ్యే చెట్లను మరోచోట రీప్లాంటేషన్ చేసేందుకు ప్రభుత్వం ఇది వరకే అనుమతులను ఇచ్చింది. ఇందుకు దాదాపు రూ. 30 కోట్లు ప్రభుత్వం కేటాయించే అవకాశం ఉంది. రీ ప్లాంటేషన్ ద్వారా అరుదైన నల్ల గోడిశ, నెమలి నారా, పాలగోడిశ, బిల్లుడు, ఇప్ప, తెల్లమద్ది, టేకు, మోదుగు, కానుగ, చొప్పరి, సోమి, మెడిసినల్ ప్లాంట్స్, మారేడు, వేప, తునికి మొదలైన చెట్లను నాటనున్నారు. కూకటి వేర్లతో సహా జాగ్రత్తగా తీసి ఈ వృక్షాలను రెండు రోజుల్లోపు మరో చోట నాటాల్సి ఉంటుందని అటవీ శాఖ అధికారులు చెపుతున్నారు.
ప్రత్యామ్నాయ ఏర్పాట్లు
వందల ఎకరాల్లో అటవీ సంపద నీట మునిగే అవకాశం ఉండడంతో ప్రాజెక్టుకు కేటాయించిన నిధులతోనే రీప్లాంటేషన్ ప్రక్రియకు అటవీ శాఖ అధికారులు శ్రీకారం చుట్టనున్నారు. అందుకు భారీ యంత్రాల తీసిన వృక్షాలను పోతారం, తుంగూర్, బీర్పూర్ అటవీ ప్రాంతాల్లో నాటడానికి అధికారులు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో దాదాపు 3-4 వేల చెట్ల వరకు రీ ప్లాంటేషన్ కోసం నిధులను ఖర్చు చేయనున్నారు. కాగా ఈ ప్రక్రియ కోసం ఢిల్లీలోని ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటివ్ ఆఫ్ ఫారెస్ట్ అనుమతుల కోసం అధికారులు ఇది వరకే ప్రతిపాదనలు పంపించారు. అనుమతులు రాగానే పని మొదలు పెట్టనున్నారు.
నివేదికలు పంపించాం
రోళ్లవాగు సమీపంలోని అటవీప్రాంతం సుమారు 816 ఎకరాల్లో నీటమునుగుతోంది. ఈ ప్రాంతంలోని చెట్లను రీ- ప్లాంటేషన్ చేసేందుకు నివేదికలు రూపొందించి ఉన్నతాధికారులకు నివేదించాం. అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తాం.
రవిప్రసాద్ డీఎఫ్ఓ, జగిత్యాల