లంచాలకూ రాయితీ అడుగుతున్నఫార్మా కంపెనీలు​

లంచాలకూ రాయితీ అడుగుతున్నఫార్మా కంపెనీలు​
  •     ఈ వింత కోరికను విచారణకు తీసుకున్న మద్రాస్​ హైకోర్టు

న్యూఢిల్లీ: గిఫ్ట్‌‌లు, క్యాష్‌‌ ఇచ్చి తమ కంపెనీ బ్రాండ్లనే సిఫార్సు చేసే విధంగా డాక్టర్లు, కెమిస్ట్‌‌లను  ఫార్మా కంపెనీలు ప్రభావితం చేస్తున్నాయనే ఆరోపణలు చాలాసార్లు వినుంటాం. ఈ ఖర్చులను తమ సేల్‌‌ ప్రమోషనల్‌‌ ఖర్చులలో కలుపుకొని ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ డిడక్షన్లను కూడా క్లయిమ్స్‌‌ చేస్తున్నాయి కొన్ని ఫార్మా కంపెనీలు. ఇటువంటి అనైతిక పద్ధతులపై విచారణ జరిపేందుకు కోర్టు స్వయంగా రంగంలోకి దిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సుమారుగా 8,667 ఫార్మా కంపెనీలు ‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ ఎక్స్‌‌పెన్సెస్‌‌’, ‘గిఫ్ట్‌‌’ ల కింద ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ను క్లయిమ్‌‌ చేశాయని ఐటీ శాఖ మద్రాస్‌‌ హైకోర్టుకు వివరించింది.  2019–20కి గాను 1,410 కంపెనీలు ఐటీఆర్‌‌(ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ రిటర్న్‌‌)‌‌ 3 ద్వారా, 1,915 కంపెనీలు ఐటీఆర్‌‌‌‌ 5 ద్వారా, 5,342 కంపెనీలు ఐటీఆర్‌‌ 6 ‌‌ ద్వారా  ‘సేల్‌‌ ప్రమోషన్‌‌ ఎక్స్‌‌పెన్సెస్‌‌’, ‘గిఫ్ట్‌‌’ కింద ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ను క్లయిమ్‌‌ చేశాయని కోర్టు ఫిబ్రవరి 17 న ఇచ్చిన ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది.

ఈ ఆర్డర్‌‌‌‌ను ఎన్‌‌ కిరుబకరన్‌‌, పీ వెలమురగన్‌‌తో కూడిన బెంచ్‌‌ ఇచ్చింది.  సేల్‌‌ ప్రమోషన్‌‌ ఖర్చులు, లైసెన్స్‌‌ ఖర్చులు ఇన్‌‌కమ్‌‌ ట్యాక్స్‌‌ నుంచి మినహాయించాలని క్లయిమ్‌‌ చేయడం తమకు ఆశ్చర్యాన్ని కలిగించిందని కోర్టు ఆ ఆర్డర్‌‌‌‌లో పేర్కొంది. డాక్టర్స్‌‌కి  మనీ, గిఫ్ట్స్‌‌ ఇవ్వడం కేవలం లంచమివ్వడంతో సమానమని కోర్టు వ్యాఖ్యానించింది. ఫార్మా కంపెనీలు ఇప్పటికి కూడా డాక్టర్లకు గిఫ్ట్‌‌లివ్వడం, ట్రావెల్‌‌ ఫెసిలిటీస్‌ను కల్పించడం,క్యాష్‌‌ గ్రాంట్లను ఇవ్వడం జరుగుతుందని వ్యాఖ్యానించింది. కంపెనీలు చట్టవిరుద్ధంగా మెడిసన్ల రేట్లను పెంచడం కూడా నిజమని పేర్కొంది. ‘సేల్‌‌ ప్రమోషనల్‌‌ ఎక్స్‌‌పెన్సెస్‌‌’, ‘గిఫ్ట్‌‌’  కింద ఇన్‌‌కమ్ ట్యాక్స్‌‌ డిడక్షన్‌‌ను క్లయిమ్‌‌ చేసిన కంపెనీలు, ఓవర్‌‌‌‌ ప్రైసింగ్‌‌ చేయడం వలన పెనాల్టీలు కట్టిన కంపెనీల వివరాలను సమర్పించాలని కోర్టు ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌ను ఆదేశించింది. ఫార్మా కంపెనీలు అనైతిక విధానాలను అనుసరిస్తున్నాయని గతంలో కూడా ఆరోపణలొచ్చాయి.  పన్ను చెల్లింపులో భాగంగా  ఓ ఫార్మా కంపెనీకి, ఐటీ డిపార్ట్‌‌మెంట్‌‌కు మధ్య విభేదాలు చెలరేగడంతో ఈ వార్తాలొచ్చాయి.