న్యూఢిల్లీ: దేశం మొత్తం మీద ఎన్నికలు జరుగుతుండడంతో సుమారు 9 లక్షల టెంపరరీ జాబ్స్ క్రియేట్ అయ్యాయని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. వివిధ జాబ్ రోల్స్ కోసం ఉద్యోగులను తీసుకుంటున్నారని తెలిపాయి. 21 రాష్ట్రాలు, యూటీలలోని 102 నియోజకవర్గాల్లో ఈ నెల 19 న మొదటి విడత ఎన్నికలు జరిగాయి.
లోక్ సభ ఎన్నికల్లో చివరి దశ జూన్ 1 న జరగనుంది. ఎలక్షన్ సైజ్, పోలింగ్ స్టేషన్ల సంఖ్య, ఎన్నికల అవసరాలను బట్టి ఈ ఏడాది ఎన్నికల్లో ఎన్ని టెంపరరీ జాబ్స్ క్రియేట్ అవుతాయనేది ఆధారపడి ఉందని వర్క్ఇండియా సీఈఓ నిలేష్ దంగర్వాల్ అన్నారు. కానీ, తమ ప్లాట్ఫామ్లో కనీసం 9 లక్షల టెంపరరీ జాబ్స్ క్రియేట్ అవుతాయని ఆయన అంచనా వేశారు.
2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఈ సారి తమ ప్లాట్ఫామ్లో అకౌంటింగ్, డేటా ఎంట్రీ, సెక్యూరిటీ పర్సనల్స్, బ్యాక్ ఆఫీస్, డెలివరీ, డ్రైవర్లు, సేల్స్ పర్సనల్స్, కంటెంట్ రైటింగ్ వంటి జాబ్ రోల్స్కు గిరాకీ పెరిగిందని నిలేష్ పేర్కొన్నారు. గత ఆరు నెలల్లో రెండు లక్షల టెంపరరీ జాబ్స్ క్రియేట్ అయ్యాయని సీఐఈఆర్ హెచ్ఆర్ ఆదిత్య నారాయణ మిశ్రా అన్నారు. ఈవెంట్ మేనేజ్మెంట్, ప్రింటింగ్, ట్రాన్స్పోర్టేషన్, ఫుడ్ అండ్ బెవరేజెస్,కేటరింగ్, సెక్యూరిటీస్, ఐటీ నెట్వర్క్ మేనేజ్మెంట్, ఎనలిటిక్స్ సెగ్మెంట్లలో టెంపరరీ జాబ్స్ పెరుగుతాయని, ఈ సెగ్మెంట్లలోని కంపెనీలు 4 లక్షల మందిని నియమించుకుంటాయని ఆయన అంచనా వేశారు.