
నల్గొండ జిల్లాలో ఘటన
హాలియా, వెలుగు: గుర్తుతెలియని దుండగుడు 90 ఏండ్ల ముసలమ్మపై అత్యాచారం చేసి ఆపై హత్య చేశాడు. నల్గొండ జిల్లా అనుముల మండలం మారేపల్లిలో ఆదివారం ఈ దారుణం జరిగింది. వడ్డేగోని గోపమ్మ కొడుకుల ఇంటి పక్కనే మరో ఇంట్లో ఒంటరిగా ఉంటోంది. ఆదివారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తి ఆమెపై అత్యాచారానికి ఒడిగట్టాడు. ఆ తర్వాత గొంతు నులిమి చంపేసి పారిపోయాడు. ముసలమ్మ అచేతనంగా పడిఉండటం గమనించిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
మిర్యాలగూడ డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ వీరరాఘవులు డెడ్ బాడీని పరిశీలించి పోస్ట్ మార్టా నికి తరలించారు. అంతకుముందు రాత్రి గోపమ్మ ఇంటి దగ్గర అదే గ్రామానికి చెందిన సత్రాల శంకర్ అనే వ్యక్తి కనిపించాడని, అతడే ఈ ఘాతుకానికి పాల్పడ్డాడని గోపమ్మ కొడుకు లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టా రు. మృతురాలికి ఐదుగురు కొడుకులు, ఇద్దరు కూతుర్లున్నారు.