
ఆదిలాబాద్, వెలుగు: 15 ఏండ్ల కింద విద్యార్థులు లేక మూతపడిన పాఠశాల మంగళవారం తెరుచుకుంది. 34 మంది విద్యార్థులు 1 నుంచి 5వ తరగతి వరకు అడ్మిషన్లు తీసుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలం డబ్బకుచ్చి మండల పరిషత్ ప్రైమరీ స్కూల్ 15 ఏండ్ల కింద విద్యార్థులు లేరనే కారణంతో మూతపడింది. అప్పటి నుంచి గ్రామానికి చెందిన విద్యార్థులు పక్క గ్రామానికి వెళ్లి చదువుకునేవారు. లేదంటే చదువు మానేసేవారు.
ఈ క్రమంలో యూఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం అధ్యక్ష, కార్యదర్శలు ఆత్రం నగేశ్, షేక్ అల్తాఫ్ సోమవారం గ్రీవెన్స్ లో కలెక్టర్ రాజర్షిషాకు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ బడి తెరిపించాలని ఆదేశించారు. మంగళవారం విద్యా శాఖ సెక్టోరియల్ అధికారులు సుజత్ ఖాన్, తిరుపతి, శ్రీకాంత్ గౌడ్ మూతబడిన పాఠశాలను పున: ప్రారంభించారు. బడిలో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని, సౌలతులు కల్పించాలని విద్యార్థి సంఘం నాయకులు, పేరెంట్స్ కోరారు.