- బూస్టర్ డోస్ వేసుకునేందుకు ముందుకొస్తలే
- స్పెషల్ డ్రైవ్ పెట్టినా ఆసక్తి చూపని జనం
- సూర్యాపేట, యాదాద్రి జిల్లాలో 12.55 లక్షల మంది అర్హులు
- ఇప్పటివరకు వ్యాక్సిన్ తీసుకుంది 93 వేల మందే...
సూర్యాపేట/యాదాద్రి, వెలుగు : రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్నా బూస్టర్ డోస్ వేసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. అన్ని పీహెచ్సీల్లో కేంద్ర ప్రభుత్వమే ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తున్నా తీసుకునేందుకు ఆసక్తి చూపడం లేదు. సూర్యాపేట, యాదాద్రి జిల్లా వ్యాప్తంగా బూస్టర్ డోస్కు అర్హులైన వారు లక్షల్లో ఉంటే వ్యాక్సిన్ వేసుకున్న వారు మాత్రం వందల్లోనే ఉన్నారు. ఇప్పటివరకు సూర్యాపేట జిల్లాలో 9 శాతం, యాదాద్రి జిల్లాలో కేవలం 5 శాతం మంది మాత్రమే వ్యాక్సిన్ తీసుకున్నారు. బూస్టర్ డోస్పై హెల్త్ ఆఫీసర్లు సరైన అవగాహన కల్పించకపోవడం వల్ల వ్యాక్సిన్ తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అర్హులు 12.55 లక్షల మంది... వ్యాక్సిన్ తీసుకుంది 93 వేల మందే...
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా 7 లక్షల మంది బూస్టర్ డోస్కు అర్హులైన వారు ఉండగా ఇప్పటివరకు 67,201 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. వీరిలో 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉన్న వారు 3,871 మంది, 45 నుంచి 59 మధ్య ఉన్న వారు 3,337 మంది, 60 సంవత్సరాలకు పైబడిన వారు 44,208 మంది ఉండగా హెల్త్ కేర్ వర్కర్లు 6,735, ఫ్రంట్ లైన్ వారియర్స్ 7,536 మంది బూస్టర్ డోస్ వేసుకున్నారు. అలాగే యాదాద్రి జిల్లాలో 5,55,497 మంది అర్హులైన వారు ఉన్నారు. ఇందులో ఈ నెల 14 వరకు 60 ఏళ్లు పైబడిన వారు, ఫ్రంట్ లైన్ వర్కర్లు కలిపి 20,181 మంది ప్రికాషన్ డోస్ తీసుకున్నారు. ఈ నెల 15 నుంచి 22 వరకు మరో 6,685 మంది వ్యాక్సిన్ వేయించుకున్నారు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు మొత్తం 26,866 మంది బూస్టర్ డోస్ వేయించుకున్నారు.
స్పెషల్ డ్రైవ్ చేపట్టినా స్పందించని జనం
కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండడంతో బూస్టర్ డోస్ వేసేందుకు సూర్యాపేట జిల్లా హెల్త్ ఆఫీసర్లు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ఇందులో భాగంగా జిల్లాలోని ప్రభుత్వ హాస్పిటల్స్, అంగన్వాడీ కేంద్రాలు, పీహెచ్సీలలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. గ్రామ, మండల లెవెల్లో ప్రజా ప్రతినిధులను భాగస్వాములను చేస్తూ మున్సిపల్, పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్లతో కలిసి బూస్టర్ డోస్పై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. అయినా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదు. సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా చేపట్టిన స్పెషల్ డ్రైవ్లో ఇప్పటివరకు 11,500 మంది మాత్రమే వ్యాక్సిన్ వేసుకున్నారు. ప్రస్తుతం కరోనా తీవ్రత అంతగా కనిపించకపోవడంతో పాటు వివిధ ఆరోగ్య కారణాలతో డోస్ తీసుకునేందుకు ప్రజలు ముందుకు రావడం లేదని ఆఫీసర్లు అంటున్నారు.
యాదాద్రిలో కనిపించని అవగాహన కార్యక్రమాలు
బూస్టర్ డోస్పై యాదాద్రి జిల్లా ఆఫీసర్లు నిర్లక్ష్యం చేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు ఎలాంటి ప్రచార, అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడంతో అసలు వ్యాక్సిన్ ఇస్తున్న విషయమే ప్రజలకు తెలియడం లేదు. ట్రీట్మెంట్ కోసం పీహెచ్సీలకు వెళ్తున్న వారు బూస్టర్ డోస్ ఇస్తున్న విషయం తెలుసుకొని అప్పటికప్పుడు వ్యాక్సిన్ వేయించు కుంటున్నారు.
ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు
బూస్టర్ డోస్పై ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దు. వ్యాక్సిన్ వేసుకున్నాక ఒకటి, రెండు రోజులు మాత్రమే బాడీ పెయిన్స్ ఉంటాయి. బూస్టస్ డోస్పై క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాం.
వెంకటరమణ, డీఐవో, సూర్యాపేట