- 30 రోజుల రీఛార్జ్ ప్లాన్ వద్దు!
- 28 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ బెటర్: కంపెనీలు
- ఈ విషయంలో ట్రాయ్ జోక్యం చేసుకోవద్దంటున్న టెలికం కంపెనీలు
- టారిఫ్ ప్లాన్ల వ్యాలిడిటీని పెంచితే వాటి రేట్లు కూడా పెరుగుతాయి
- యూజర్లలో గందరగోళం క్రియేటవుతుంది : ఎయిర్టెల్, వీ, జియో
బిజినెస్డెస్క్, వెలుగు: ప్రీపెయిడ్ టారిఫ్ల వ్యాలిడిటీని మార్చడంపై జోక్యం చేసుకోవద్దని టెలికం రెగ్యులేటరీ ట్రాయ్ను రిలయన్స్ జియో, భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా (వీ) లు కోరుతున్నాయి. ట్రాయ్ జోక్యం చేసుకుంటే సిస్టమ్లో గందరగోళం ఏర్పడుతుందని, చివరికి యూజర్లకే నష్టం కలుగుతుందని చెబుతున్నాయి. నెల వారి టారిఫ్ ప్లాన్ల వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటున్న విషయం తెలిసిందే. దీనిపై కన్జూమర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. 12 నెలలుంటే ఏడాదికి 13 సార్లు రీఛార్జ్ చేసుకోవాల్సి వస్తోందని చెబుతున్నారు. టెలికం కంపెనీలు మోసం చేస్తున్నాయంటూ ట్రాయ్కు ఫిర్యాదు చేస్తున్నారు. దీంతో ప్రీపెయిడ్ టారిఫ్ల వ్యాలిడిటీని పెంచాలా లేదా ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలనే అంశంపై తమ అభిప్రాయాలను చెప్పాలని టెలికం కంపెనీలను ట్రాయ్ కోరింది. దీనిపై కంపెనీలు తమ అభిప్రాయాలను సబ్మిట్ చేశాయి.
ప్రస్తుత విధానమే కొనసాగాలి..
ఇప్పుడున్న విధానాన్నే కొనసాగించాలని ట్రాయ్కు భారతీ ఎయిర్టెల్ సలహాయిచ్చింది. రేట్లకు సంబంధించని టారిఫ్ ఫ్రేమ్వర్క్(వ్యాలిడిటీ కూడా) లో ట్రాయ్ జోక్యం చేసుకోవద్దని కోరింది. వ్యాలిడిటీని పెంచితే టారిఫ్ ప్లాన్ల రేట్లను టెలికం కంపెనీలు మార్చాల్సి ఉంటుందని పేర్కొంది. ఇదే విషయాన్ని జియో కూడా వ్యక్తం చేసింది. యావరేజ్ రెవెన్యూ పెర్ యూజర్ (ఏఆర్పీయూ) ను తగ్గించుకోవడానికి కంపెనీలు ముందుకు రావని తెలిపింది. మంత్లీ ప్లాన్ల వ్యాలిడిటీని పెంచితే వీటికి తగ్గట్టు ప్లాన్ల రేట్లను కూడా మారుస్తాయని పేర్కొంది. కొత్త రేట్లు యూజర్లను గందరగోళానికి గురిచేస్తాయని తెలిపింది. 28, 56, 84 రోజుల వ్యాలిడిటీ ఉన్న ప్రీపెయిడ్ టారిఫ్ వ్యాలిడిటీని అలానే కొనసాగించాలని వొడాఫోన్ ఐడియా ట్రాయ్కు సలహాయిచ్చింది. టారిఫ్ వ్యాలిడిటీలో మార్పులొస్తే యూజర్లకు అవగాహన కల్పించడం, బిల్లింగ్ సిస్టమ్ను మార్చడం, మీడియా, పబ్లిక్ ఛానెల్స్లో ప్రమోట్ చేయడం వంటి చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పేర్కొంది. ప్రస్తుత విధానంలో టారిఫ్లను డిజైన్ చేసుకునే ఫ్రీడమ్ కంపెనీలకు ఉంది. మార్కెట్లోని పరిస్థితులకు అనుగుణంగా కంపెనీలు తమ టారిఫ్ ప్లాన్లను ఆఫర్ చేస్తున్నాయి. కానీ, టారిఫ్ ప్లాన్ల రేట్లను, ఇతర విషయాలను ట్రాయ్ కంట్రోల్ చేస్తుందన్న విషయం తెలిసిందే.
ప్రతీ నెల ఒకే తేదీన రీఛార్జ్ డ్యూ అసాధ్యం
మొబైల్ కన్జూమర్ అసోసియేషన్ అయిన కన్జూమర్ వాయిస్ కొన్ని ప్రిపెయిడ్ వ్యాలిడిటీ ప్లాన్లపై ట్రాయ్కు సలహాయిచ్చింది. అన్ని టారిఫ్ ప్లాన్లను 1 రోజు, 7 రోజులు, 15 రోజులు, వన్ మంత్ వ్యాలిడీటీల కింద స్టాండర్డ్యిజ్ చేయాలని తెలిపింది. వన్ మంత్ వ్యాలిడిటీ ప్లాన్లో తర్వాతి నెల రీఛార్జ్ బకాయి, ముందు నెలలో రీఛార్జ్ చేసుకున్న తేదీనే ఉండాలని రికమండ్ చేసింది. కాగా, కన్జూమర్ వాయిస్ ఇచ్చిన సలహాలను టెలికం కంపెనీలు తోసిపుచ్చాయి. మంత్లీ రీఛార్జ్ డ్యూ డేట్ ప్రతీ నెల ఒకే తేదీన ఉండేలా చేయడం అసాధ్యమని కంపెనీ చెబుతున్నాయి. చాలా మంది యూజర్లు రీఛార్జ్ ప్యాక్ ముగిసిన రెండు మూడు రోజుల తర్వాత గాని రీఛార్జ్ చేసుకోరని అంటున్నాయి. మరోవైపు జియో 30, 60, 90 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లను యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది.
జియో మళ్లీ వార్ స్టార్ట్ చేసిందా?
30 రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను జియో ఇప్పటికే తీసుకొచ్చింది. దీంతో ఎయిర్టెల్, వీ నెట్వర్క్లపై ఒత్తిడి పెరుగుతోంది. వ్యాలిడిటీని పెంచి కొత్త ప్లాన్లను తీసుకొస్తే, రేట్లను పెంచక తప్పదు. కొత్త ప్లాన్ల గురించి ప్రకటనలు చేయాల్సి ఉంటుంది. టారిఫ్ ప్లాన్లలో మార్పులొస్తే రేట్లకు సంబంధించి కంపెనీలు అడ్జస్ట్ అవ్వడమో లేదా రీబ్యాలెన్స్ కావడమో ఉంటుంది. ఇలాంటి ప్లాన్లతో యూజర్లను జియో మానిప్యులేట్ చేస్తోందని, తన లాభాలను పెంచుకుంటోందని ఇండస్ట్రీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. ‘జియో ఇంకా టెస్టింగ్ స్టేజ్లోనే ఉంది. 28 రోజుల వ్యాలిడిటీ ఉన్న మంత్లీ ప్లాన్లను ఆఫర్ చేస్తూనే, 30 రోజుల టారిఫ్ ప్లాన్ను ఎక్కువ రేటుకి తీసుకొచ్చింది. ఒకవేళ ఈ కొత్త టారిఫ్ ప్లాన్ యూజర్లను ఆకర్షిస్తే ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియాలు కూడా 30 –రోజుల వ్యాలిడిటీ ప్లాన్లను తీసుకొస్తాయని’ అని ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్ ఒకరు చెప్పారు. ఫ్రీడమ్ ప్లాన్స్ పేరుతో 15 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను రూ. 127 కు, 365 రోజుల వ్యాలిడిటీ ప్లాన్ను రూ. 2,397 కు జియో తీసుకొచ్చింది. ఇప్పుడున్న 15, 365 రోజుల ప్లాన్లతో పోలిస్తే కొత్త ప్లాన్లు వరసగా 21 శాతం, 16 శాతం ఎక్కువ. ఫ్రీడమ్ ప్లాన్స్ కింద తెచ్చిన మిగిలిన ప్లాన్లు 5 శాతం ఎక్కువ.