ముంబై: స్టాక్ మార్కెట్లు శుక్రవారం ప్రారంభ కనిష్ట స్థాయిల నుంచి పుంజుకుని ఎగువన ముగిశాయి. బ్యాంకింగ్, ఆటో షేర్లలో భారీ కొనుగోళ్లతో నాలుగు రోజుల నష్టాల నుంచి బయటపడ్డాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 599.34 పాయింట్లు పెరిగి 73,088.33 వద్ద స్థిరపడింది. ఎర్లీ ట్రేడ్లో ఇండెక్స్ దిగువన ప్రారంభమై 672.53 పాయింట్లు తగ్గి 71,816.46 వద్ద కనిష్టస్థాయికి చేరుకుంది. అయితే బ్యాంకింగ్ షేర్లలో వాల్యూ బయింగ్ కారణంగా కొంతసేపటికి సూచీ పుంజుకుంది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 151 పాయింట్లు పెరిగి 22,147 వద్ద ముగిసింది. ఎర్లీ ట్రేడ్లో బ్రాడర్ ఇండెక్స్ 21,777.65 కనిష్ట స్థాయికి పడిపోయింది. సెన్సెక్స్ ప్యాక్ నుంచి బజాజ్ ఫైనాన్స్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, జేఎస్డబ్ల్యూ స్టీల్, మారుతీ, విప్రో, భారతీ ఎయిర్టెల్, బజాజ్ ఫిన్సర్వ్, ఐసీఐసీఐ బ్యాంక్, ఐటీసీ లాభపడ్డాయి. అయితే నెస్లే ఇండియా, హెచ్సీఎల్ టెక్నాలజీస్, లార్సెన్ అండ్ టూబ్రో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, టాటా మోటార్స్, ఇన్ఫోసిస్ షేర్లకు నష్టాలు వచ్చాయి. 2025 ఆర్థిక సంవత్సరం కోసం కంపెనీ ఆదాయ వృద్ధి మార్గదర్శకాలు మార్కెట్ అంచనాలను అందుకోకపోవడంతో ఇన్ఫోసిస్ షేర్ దాదాపు ఒక శాతం క్షీణించింది. ఆసియా మార్కెట్లలో, సియోల్, టోక్యో, షాంఘై హాంకాంగ్లకు నష్టాలు తప్పలేదు. యూరోపియన్ మార్కెట్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. వాల్ స్ట్రీట్ గురువారం చాలా నెగెటివ్గానే ముగిసింది. గ్లోబల్ ఆయిల్ బెంచ్మార్క్ బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 0.55 శాతం పెరిగి 87.62 డాలర్లకు చేరుకుంది. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) గురువారం రూ. 4,260.33 కోట్ల విలువైన ఈక్విటీలను అమ్మారు. బ్రాడ్ మార్కెట్లో, బీఎస్ఈ మిడ్క్యాప్ గేజ్ 0.39 శాతం క్షీణించగా, స్మాల్క్యాప్ ఇండెక్స్ 0.04 శాతం తగ్గింది. ఇండెక్స్లలో బ్యాంకెక్స్ 1.02 శాతం, మెటల్ 0.85 శాతం ఎగబాకాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.83 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.78 శాతం, కమోడిటీలు 0.54 శాతం కూడా లాభపడ్డాయి. ఐటీ, టెలికమ్యూనికేషన్, యుటిలిటీస్, రియాల్టీ టెక్ వెనుకబడి ఉన్నాయి. ఈవారంలో సెన్సెక్స్ 1,156.57 పాయింట్లు, నిఫ్టీ 372.4 పాయింట్లు నష్టపోయాయి.