కాగితంపై బొమ్మ గీయాలంటే పెన్సిల్, రంగులు కావాలంటారు చాలామంది. కానీ, మధ్యప్రదేశ్ లోని రాంజీ ప్రాంతానికి చెందిన సింటూ మౌర్య మాత్రం బొమ్మ గీయడానికి బ్రష్ అవసరం లేదు.. పెయింట్ అక్కర్లేదు.. పెన్సిల్ ముట్టుకోను అంటున్నాడు. టొమాటో కెచప్, టీ లాంటి పదార్థాలతో చేతితోనే బొమ్మలు గీస్తూ అందరినీ అబ్బురపరుస్తున్నాడు. తాజాగా డికాషన్తో ప్రధాని మోడీ బొమ్మగీసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో... సింటూ మౌర్య నీళ్లలో టీ పౌడర్ వేసి డికాషన్ చేస్తాడు. అది చల్లారాక కాగితంపై పోసి చేతితో మోడీ బొమ్మ గీస్తాడు. చూడ్డానికి అచ్చం పెయింట్తో వేసిన బొమ్మలాగే ఉన్న ఈ చాయ్ బొమ్మకు నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఫింగర్ పెయింటింగ్ ఆర్టిస్ట్లు చాలామందే ఉంటారు. కానీ మౌర్యలాంటివాళ్లు చాలా అరుదు అంటూ కామెంట్లు పెడుతున్నారు.